సిద్దిపేట యార్డులో పడిగాపులు
సిద్దిపేట యార్డులో కందులు
కంది రైతుకు తిప్పలు తప్పడం లేదు. మార్కెట్ యార్డులో మద్దతు ధర కోసం వస్తే పట్టించుకునే నాథుడు కరువయ్యారు. కంది గింజలతో రోజుల కొద్దీ అన్నదాతలు పడిగాపులు కాస్తున్నారు. ఓపిక నశించి ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తోంది. దీంతో ప్రభుత్వ కొనుగోళ్లకు దీటుగా దళారులు కంది పంటనుచేజిక్కించుకున్నారు.
సిద్దిపేటజోన్: జిల్లాలో వ్యవసాయ శాఖ రికార్డుల ప్రకారం.. 6,606 ఎకరాల్లో కంది పంట సాగు అయింది. దీనితో ప్రభుత్వం కందుల కొనుగోలు ప్రక్రియలో భాగంగా సిద్దిపేట గజ్వేల్, హుస్నాబాద్ ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. క్వింటాలు కందుల ధర రూ 8వేలు మద్దతు ధర ప్రకటించారు. అత్యధికంగా సిద్దిపేట, దుబ్బాక, హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోని 15మండలాల్లో కందుల సాగు ఉంటుంది.
రోజుల కొద్దీ
కందికి మద్దతు ధర అందించే సదుద్దేశంతో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలు రైతులకు నిరాశకు గురి చేస్తున్నాయి. సిద్దిపేట యార్డులో కంది పంట కొనుగోలు కోసం రోజుల కొద్దీ పడిగాపులు కాసే పరిస్థితి నెలకొంది. నాణ్యత నిబంధనలు పేరిట అధికారులు కంది గింజలను తిరస్కరించడంతో చేసేదిలేక నాలుగు సార్లు యార్డులో అర పెట్టాల్సి వస్తుంది. గింజలను పరిశీలిస్తున్న సిబ్బంది ఇష్టానుసారంగా సమయపాలన పాటించడంతో రైతులు వారి కోసం ఎదురుచూడాల్సి వస్తుంది. జనవరి 29న సిద్దిపేట యార్డులో కేంద్రం ఏర్పాటు చేయగా ఇప్పటివరకు 45 మంది రైతుల వద్ద కేవలం 1350 క్వింటాళ్ల కందులు కొనుగోలు చేశారు.
సిద్దిపేట యార్డులో ప్రభుత్వం కందుల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసినప్పటికీ ఇక్కడ దళారులదే పై చేయి అని చెప్పాలి. ఇప్పటివరకు 1,111 రైతుల వద్ద 3,379 క్వింటాళ్ల కందులు ప్రైవేట్ వ్యాపారులు కొనుగోలు చేశారు. మొదట్లో నాలుగు వేలకు కొనుగోలు చేసిన వ్యాపారులు ప్రభుత్వ కేంద్రం ఏర్పాటు తర్వాత కనిష్టంగా 6,800 గరిష్టంగా 7,300 ధరకు కొనుగోలు చేస్తున్నారు. అయినా క్వింటాలు కందికి రూ 700 లాభం అర్జిస్తున్నారు.
తప్పని కొనుగోలు తిప్పలు
నిబంధనల పేరిట కొర్రీలు
దిక్కులేని పరిస్థితుల్లో ప్రైవేట్ వైపు..


