
మల్లన్న స్వామికి లక్ష బిల్వార్చన
రుద్రనామస్మరణతో
మారుమోగిన ఆలయం
కొమురవెల్లి(సిద్దిపేట): మేడలమ్మ, కేతమ్మ సమేత కొమురవెల్లి మల్లన్న స్వామికి సోమవారం అత్యంత వైభవంగా లక్షబిల్వార్చన, రుద్రాభిషేకం నిర్వహించారు. రుద్రనామస్మరణతో ఆలయ పరిసరాలు మారుమోగాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా వీరశైవ రుత్వికులు స్వామివారికి శాస్త్రోక్తంగా లక్ష బిల్వార్చన జరిపారు. ఆలయ తోట బావి ఆవరణలో అంగరంగ వైభవంగా నిర్వహించిన స్వామి వారి కల్యాణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమైన విషయం విదితమే. ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు మల్లన్నకు సుప్రభాతసేవ, గణపతిపూజ, గౌరి పూజ, శివపుణ్యాహవాచనం, అఖండ దీపస్థాపన, పంచకలశారాధన, నవగ్రహ, దిక్పాలక, ఏకాదశరుద్ర, తదితర ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అధికారులు, ప్రధానార్చకులు మహదేవుని మల్లికార్జున్, పూజారులు.అధికారులు తదితరులు పాల్గొన్నారు.
కల్యాణం బుకింగ్ ఆదాయం రూ.16.51లక్షలు
మల్లన్న కల్యాణం సందర్భంగా భక్తులు భారీగా తరలివచ్చి మొక్కుబడులు తీర్చుకున్న క్రమంలో రూ.16,51,520 మేర ఆదాయం సమకూరినట్లు ఆలయ వర్గాలు తెలిపాయి.