అఖిలపక్ష నేతల డిమాండ్
స్టేషన్ మేనేజర్కు వినతి పత్రం
జహీరాబాద్: బుల్లెట్ రైలు మార్గం ఏర్పాటుకు జహీరాబాద్ అన్ని విధాలుగా సానుకూలంగా ఉంటుందని, దీన్ని దృష్టిలో పెట్టుకుని పనులు చేపట్టాలని ఎమ్మెల్యే కె.మాణిక్రావు అన్నారు. శనివారం మున్సిపల్ కార్యాలయం సమావేశ మందిరంలో డీసీఎంఎస్ మాజీ చైర్మన్ ఎం.శివకుమార్ అధ్యక్షతన అఖిలపక్ష నేతల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జహీరాబాద్ మీదుగా కాకుండా వికారాబాద్ మీదుగా బుల్లెట్ రైలు నడపాలని ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఇది సరైంది కాదన్నారు. జహీరాబాద్ ప్రాంతంలో 12వేల ఎకరాల విస్తీర్ణంలో నిమ్జ్ ప్రాజెక్టు ఏర్పాటు కాబోతోందని, దీంతో భారీ పారిశ్రామిక ప్రాంతంగా రూపుదిద్దుకోనుందన్నారు. ప్రాజెక్టు సాధనలో భాగంగా ఈనెల 15వ తేదీన జహీరాబాద్ ఎంపీ సురేష్శెట్కార్ ఆధ్వర్యంలో మంత్రులు శ్రీధర్బాబు, దామోదర రాజనర్సింహాలను కలిసి వినతి పత్రాలను ఇవ్వాలని సమావేశంలో తీర్మానించారు. ఢిల్లీ స్థాయిలో మాజీ ఎంపీ బీబీ పాటిల్ తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. అనంతరం రైల్వే స్టేషన్కు ర్యాలీగా వెళ్లి స్టేషన్ మేనేజర్ మాధవకృష్ణకు వినతి పత్రం అందజేశారు. సమావేశంలో ఐడీసీ మాజీ చైర్మన్ ఎండీ తన్వీర్, కాంగ్రెస్ పార్లమెంట్ ఇన్చార్జి ఎస్.ఉజ్వల్రెడ్డి, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ ఎం.శివకుమార్, మున్సిపల్ చైర్మన్ యూనుస్ తదితరులు పాల్గొన్నారు.


