జహీరాబాద్: నియోజకవర్గంలో సాగు నీటి ప్రాజెక్టులను పూర్తిగా విస్మరించడంతో అవి నిరుపయోగంగా మారాయని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వై.నరోత్తం అన్నారు. శనివారం సాగునీటి ప్రాజెక్టులను సందర్శించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలో 76వరకు సాగునీటి వనరులు ఉన్నాయని, వీటి ద్వారా 12వేలకు పైగా ఎకరాల భూములు సాగు కావాల్సి ఉందన్నారు. అయినా మూడువేల ఎకరాలకు మించి సాగు కావడం లేదన్నారు. ఈఈ కార్యాలయం ఏర్పాటు చేసి 45 మంది వరకు అధికారులు, సిబ్బందిని నియమించినా పనులు ఎక్కడిగొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నాయన్నారు. వీరికి వేతనాల రూపంలో నెలకు రూ.4కోట్ల మేర ఖర్చవుతున్నాయని పేర్కొన్నారు. జహీరాబాద్ నియోజకవర్గంలోని సంగమేశ్వర ప్రాజెక్టు కింద 1.05లక్షల ఎకరాలకు, నారాయణఖేడ్ నియోజకవర్గంలోని 2.10లక్షల ఎకరాలకు బసవేశ్వర ఎత్తిపోతల పథకాల కింద సాగు నీరందించాలని నిర్ణయించినా ఇది ముందుకు సాగడం లేదన్నారు. ఆయా ప్రాజెక్టులను పూర్తి చేసి సాగునీటిని అందించాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. సాగునీటి ప్రాజెక్టులను వినియోగంలోకి తీసుకురావాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. సమావేశంలో రైతులు శివకుమార్, ఎస్.గోపాల్, వెంకట్, వీర్శెట్టి, మేఘనాథ్ పాల్గొన్నారు.
ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ నరోత్తం


