జిల్లా న్యాయ సేవాధికార సంస్థ
కార్యదర్శి సౌజన్య
సంగారెడ్డి టౌన్: విద్యాహక్కు చట్టంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్య పిలుపునిచ్చారు. శుక్రవారం ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా స్థానిక నర్సింగ్ కళాశాలలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 14 సంవత్సరాల లోపు పిల్లలను పనిలో పెట్టుకోవద్దన్నారు. బాలల సంక్షేమం, భద్రత హక్కుల పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. ఉచిత న్యాయ సహాయం కోసం జిల్లా న్యాయస్థానాన్ని సంప్రదించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ యాదయ్య, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
ఎస్పీ పరితోష్ పంకజ్
సంగారెడ్డి జోన్: పెండింగ్లో ఉన్న కేసులను తక్షణం పరిష్కరించాలని ఎస్పీ పరితోష్ పంకజ్ ఆదేశించారు. శుక్రవారం తన కార్యాలయంలో పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పోలీస్ స్టేషన్లకు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడి, వారికి భరోసా కల్పించాలన్నారు. ప్రతి గ్రామానికి పోలీసు అధికారులు నియమించి, గ్రామాలలో ముందస్తుగా సమాచారం సేకరించాలని కోరారు. విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ప్రశంసా పత్రాలు, రివార్డులు అందించారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి, డీఎస్పీలు, తదితరులు పాల్గొన్నారు.
సంగారెడ్డి టౌన్: జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో ఈనెల 16న జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా అధికారి రవికిరణ్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఫ్లిప్కార్ట్, శ్రీరామ్ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ, అపోలో ఫార్మసీలో వివిధ శాఖల్లో కేటగిరీలకు సంబంధించి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని పూర్తి బయోడేటాతో సంగారెడ్డి ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో హాజరు కావాలన్నారు. మరిన్ని వివరాలకు 08455271010 నంబర్ను సంప్రదించాలన్నారు.
సంగారెడ్డి జోన్: జిల్లాలో ఆయిల్ పామ్ పంట సాగు చేస్తున్న రైతులకు రెండు రోజులపాటు విజ్ఞాన యాత్రకు తీసుకెళ్లారు. జాతీయ ఆయిల్ పామ్ మిషన్లో భాగంగా ఖమ్మంలో నిర్వహించే ఈ యాత్రకు జిల్లా నుంచి ఆసక్తి ఉన్న 22 మంది రైతులను ఎంపిక చేసి పంపించారు. శుక్రవారం కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో అదనపు కలెక్టర్ సంగీత జెండా ఊపి ప్రారంభించారు. శాసీ్త్రయ పద్ధతిలో సాగు చేసేందుకు కొనిజర్ల మండలంలో రెండు రోజులపాటు అవగాహన కల్పించనున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యానవన శాఖ అధికారి సోమేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.
సదాశివపేట(సంగారెడ్డి): ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు ఎరువులు విక్రయించిన డీలర్లపై కఠిన చర్యలు తప్పవని ఏడీఏ వెంకటలక్ష్మి హెచ్చరించారు. శుక్రవారం సాక్షిలో ప్రచురితమైన ఎరువు దోపిడీ వార్తకు వ్యవసాయ అధికారులు స్పందించారు. ఈ మేరకు పట్టణంలోని ఎరువులు, విత్తనాల దుకాణాలతోపాటు గోదాంలను సహాయ వ్యవసాయ సంచాలకురాలు వెంకటలక్ష్మి ఆకస్మికంగా తనిఖీ చేసి స్టాక్ రిజిష్టర్లను పరిశీలించారు. దుకాణాల్లో స్టాక్బోర్డులో ఎరువులు, విత్తనాల నిల్వలను ప్రదర్శించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి రమేష్, మంజీర రైతు సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు పృథ్వీరాజ్, గౌరవ అధ్యక్షుడు వెంకట్రావు పాల్గొన్నారు.


