సంగారెడ్డిటౌన్: రాజీమార్గంతో కేసులు పరిష్కరించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవానిచంద్ర అన్నారు. గురువారం జిల్లా కోర్టులో న్యాయవాదులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పెండింగ్లో ఉన్న కేసులను త్వరగా పరిష్కరించాలన్నారు. రాజీమార్గంతో కేసులను పరిష్కరించుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావా లని సూచించారు. ఈనెల 20న నిర్వహించే జా తీయ లోక్ అదాలత్ను విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు.
సంగారెడ్డి ఎడ్యుకేషన్: ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. ప్రథమ సంవత్సరం పరీక్షలకు జిల్లావ్యాప్తంగా 9,073 మంది విద్యార్థులు హాజరుకాగా, 5,661 మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో బాలురు 4,518 మందికి గానూ 2,506 మంది ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 4,555 మందికి గానూ 3,155 మంది పాసయ్యారు. ఒకేషనల్ విభాగంలో 587 మంది బాలురకు గానూ 391 మంది, బాలికలు 234 మందికి గానూ 172 మంది ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయ సంవత్సరం విభాగంలో 4,648 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 2,217 మంది పాసయ్యారు. బాలుర విభాగంలో 2,618 మందికి గానూ 1,206 మంది, బాలికలు 2,030 మందికి గానూ 1,011 మంది ఉత్తీర్ణత సాధించారు. ఒకేషనల్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో 319 మంది బాలురకు గానూ 228 మంది ఉత్తీర్ణత సాధించగా, 171 మంది బాలికలకు గానూ 120 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.
సంగారెడ్డి టౌన్: పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్య అన్నారు. గురువారం పట్టణంలోని శిశు గృహ, సఖి కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చుట్టుపక్కల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందికి సూచించారు. సఖి కేంద్రాన్ని సందర్శించే బాధితుల సమస్యలను పరిష్కరించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం బాలల హక్కుల రక్షణ చట్టంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జిల్లా మహిళా సంక్షేమ అధికారి లలిత కుమారి, న్యాయవాదులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
చేగుంట(తూప్రాన్): సర్వ శిక్షా అభియాన్లో పనిచేస్తున్న సిబ్బందిని శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని తపస్ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు ఎల్లం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం చేగుంటలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం సర్వ శిక్షా అభియాన్ సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలన్నారు. ఇప్పటికే పంజాబ్ ప్రభుత్వం శాశ్వత ఉద్యోగులుగా గుర్తించిందన్నారు. సమ్మె కాలానికి సంబంధించిన వేతనాలు సైతం అందించాలని కోరారు. సమావేశంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జాల సిద్దూ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లక్ష్మణ్, రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
డిగ్రీలో ప్రవేశం కోసం దరఖాస్తుల ఆహ్వానం
హుస్నాబాద్: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇంటర్మీడియెట్ పూర్తి చేసిన విద్యార్థుల నుంచి డిగ్రీ మొదటి సంవత్సరంలో ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ భిక్షపతి తెలిపారు. దోస్త్ ద్వారా అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. జూన్ 15వ తేదీ లోగా వివిధ డిగ్రీ కోర్సులలో ప్రవేశం కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.


