● ఇంటర్ విద్యార్థులకు చక్కని అవకాశం ● అటానమస్ కళాశాల ప్రిన్సిపాల్ సునీత
సిద్దిపేటఎడ్యుకేషన్: ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు దోస్త్ మూడో విడత ప్రవేశాల ప్రక్రియను సద్వినియోగం చేసుకుని ప్రభుత్వ డిగ్రీ, పీజీ అటానమస్ కళాశాలలో చేరాలని ప్రిన్సిపాల్ డాక్టర్ సునీత కోరారు. గురువారం కళాశాలలోని జిల్లా దోస్త్ హెల్ప్లైన్ సెంటర్ ద్వారా పలువురు విద్యారుల వివరాలను ప్రవేశాల కోసం నమోదు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కళాశాలలో ఇప్పటికే కొనసాగుతున్న హెల్త్కేర్ (ఏఈడీపీ)అప్రెంటిషిప్ ఎంబీడెడ్ డిగ్రీ ప్రోగ్రాం కోర్సుతో పాటు ఈ విద్యాసంవత్సరం నూతనంగా బీఎస్సీ ఫార్మసిటికల్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ క్వాలిటీ, బీఎస్సీ ఫిషరీస్ అండ్ అక్వాకల్చర్ (ఏఈడీపీ) కోర్సులు ప్రారంభం అయినట్లు చెప్పారు. ఈ కోర్సులలో చేరిన విద్యార్థులకు డిగ్రీ ఫైనలియర్లో పరిశ్రమలలో శిక్షణను అందిస్తూ ప్రతి నెల రూ.9000 పారితోషికాన్ని భారత ప్రభుత్వం అందిస్తుందని చెప్పారు. కళాశాలలో అనుభవజ్ఞులైన అధ్యాపకులు సకల సౌకర్యాలు గల ప్రయోగశాలలు, లైబ్రరీ, విశాలమైన మైదానం అందుబాటులో ఉన్నాయన్నారు. ఉత్తీర్ణులైన విద్యార్థులు కళాశాలను సందర్శించి వవరాలు తెలుసుకుని దోస్త్ ద్వారా తమ కళాశాలలో చేరాలని కోరారు. ఉత్తీర్ణ సాధించిన విద్యార్థులతో పాటు ఇప్పటికి మొదటి, రెండో విడుతలో రిజిస్ట్రేషన్ చేసుకోనివారు ఈ నెల 25లోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో సమస్యలు వస్తే కళాశాలలో ఏర్పాటు చేసిన జిల్లా దోస్త్ హెల్ప్లైన్ సెంటర్ను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ అయోధ్యరెడ్డి, సీఓఈ డాక్టర్ గోపాలసుదర్శనం, అధ్యాపకులు పాల్గొన్నారు.


