జహీరాబాద్: జిల్లాకు చెందిన 50 మంది ఉత్తమ మహిళా రైతులు శుక్రవారం పటాన్చెరులోని ఇక్రిశాట్ను సందర్శించారు. ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో జహీరాబాద్ ప్రాంతానికి చెందిన మహిళా రైతులు క్షేత్రపర్యటనకు వెళ్లారు. ఇక్రిశాట్ ఫౌండేషన్ దినోత్సవాన్ని పురస్కరించుకుని సంస్థ ఆహ్వానం మేరకు రైతులు తరలివెళ్లారు. ఈ సందర్భంగా డైరెక్టర్ జనరల్ హిమాంశు పాఠక్ మాట్లాడుతూ...వ్యవసాయంలో మహిళా రైతుల పాత్ర కీలకమైందన్నారు. తమ సంస్థ మహిళా రైతుల అభ్యున్నతికి చాలా కృషి చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమం ద్వారా వ్యవసాయంలో అనేక నూతన వంగడాలు, ఆధునిక పద్ధతుల గురించి ఇక్రిశాట్లో క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిశోధనల గురించి మహిళా రైతులకు వివరించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి శివప్రసాద్, సదాశివపేట, సంగారెడ్డి, జహీరాబాద్ ఉద్యాన విస్తరణ అధికారులు సునీత, రవి, విఠల్, అరణ్య, ప్రతినిధి కిష్టయ్య, బిడకన్నె, రాయిపల్లి, సింగితం, జహీరాబాద్ ప్రాంత మహిళా రైతులు పాల్గొన్నారు.
క్షేత్రస్థాయి సందర్శనలో
పరిశోధనలపై అవగాహన


