‘తెల్ల’బోయిన పత్తి
● భారీగా తగ్గిన పత్తి దిగుబడి ● ఇంట్లో నిల్వ...బయట అప్పులు ● అయోమయంలో రైతులు
మునిపల్లి(అందోల్): ఈ ఏడాది అధిక వర్షాల కారణంగా పత్తి పంట దిగుబడి భారీగా తగ్గిపోయింది. పంట దిగుబడి కోసం తెచ్చిన అప్పులు రోజురోజుకు పెరిగిపోతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పత్తి పంటను అమ్మేందుకు కపాస్ కిసాన్ యాప్లో స్లాట్ బుక్ చేసి ఎకరాకు 7 క్వింటాళ్ల పత్తినే కొనుగోలు చేస్తామని సీసీఐ పెట్టిన నిబంధనలతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సీసీఐలో తేమ 12% ఉంటే ధర రూ.8,110 చొప్పున కొనుగోలు చేస్తున్నట్లు రైతులు చెబుతున్నారు. దీంతో సీసీఐకు పత్తిని అమ్మకుండా ఇంట్లోనే నిల్వ ఉంచుతున్నారు. మళ్లీ వర్షాలు పడితే నిల్వ ఉంచిన పత్తి ఏమైపోతుందోననే ఆందోళనతో రైతులు దళారులను ఆశ్రయిస్తున్నారు. వారికి క్వింటాల్కు రూ.6,500ల నుంచి రూ.7వేల వరకు నష్టానికి అమ్ముకుంటున్నారు. దీంతో రైతులు మరింత అప్పుల ఊబిలో కూరుకుపోయే పరిస్థితి ఏర్పడింది.
కేంద్రమంత్రికి లేఖ
పత్తి రైతులకు ఇబ్బంది లేకుండా లాభం వచ్చే విధంగా చూడాలని మంత్రి దామోదర రాజనర్సింహ్మ, మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు దృష్టికి తీసుకెళ్లారు. కేంద్రమంత్రి గిరిరాజ్సింగ్, సీసీఐ సీఎండీ లలిత్ కుమార్ గుప్తాకు మంత్రి తుమ్మల లేఖ రాసినట్లు రాయికోడ్ మార్కెట్ కమిటీ చైర్మన్ సుధాకర్రెడ్డి తెలిపారు.
క్వింటాల్ రూ.15 వేలు
తగ్గిన దిగుబడి కారణంగా పత్తి పంట క్వింటాల్కు రూ.15 వేల చొప్పున తేమ శాతం చూడకుండా సీసీఐ అధికారులు కొనుగోలు చేయాలి. కపాస్ కిసాన్ స్లాట్ బుకింగ్ను తొలగించి, పాత పద్ధతిలోనే పత్తి పంటను సీసీఐ అధికారులు కొనుగోలు చేయాలి.
– సుధాకర్రెడ్డి (రైతు)
సీఎండీ లలిత్గుప్తా నిర్ణయం
కపాస్ కిసాన్ యాప్ స్లాట్ బుకింగ్ ద్వారానే పత్తి కొనుగోలు చేయాలని వరంగల్ సీసీఐ జీఎం, కేంద్ర టెక్స్టైల్స్ మంత్రి గిరిరాజ్ సింగ్, సీసీఐ సీఎండీ లలిత్గుప్తా ఆదేశాలతో పత్తి కొనుగోళ్లు జరుగుతున్నాయి. సీసీఐ నిబంధనల ప్రకారం తేమ శాతాన్ని బట్టి ధర ఉంటుంది.
– వరుణ్ (రాయికోడ్ మార్కెట్ కమిటీ,సీనియర్ కమర్షియల్ అధికారి)


