 
															అక్రమాలకు ‘అండదండ’లు
నేతల తీరుతో అధికారులకు చింత ఇంద్రేశం, అమీన్పూర్లలో యథేచ్ఛగా నిర్మాణాలు నాయకుల జోక్యంతో దిక్కుతోచని స్థితిలో అధికారులు
పటాన్చెరు: అమీన్పూర్లోని వాణీనగర్లో అన్ని అనుమతులతో సర్వే నంబర్ 174 పరిధిలో వెలుస్తున్న నిర్మాణాలపై స్థానిక మాజీ కౌన్సిలర్ కన్ను పడింది. తనను సంప్రదించకుండా హెచ్ఎండీఏ అనుమతులతో ఆ బిల్డర్ నిర్మాణ పనులు చేపడుతుండటంతో ఆ మాజీ కౌన్సిలర్కు చిర్రెత్తి పోయింది. దీంతో మున్సిపల్ సిబ్బందిని పురమాయించి పనులు ఆపాలని హుకుం జారీ చేశాడు. కానీ ఆ బిల్డర్ ఎవరికీ బెదరలేదు. ఏం చేయాలో తోచక ఆ మాజీ కౌన్సిలర్ ఆ బిల్డింగ్కు హెచ్ఎండీఏ తప్పుడు పద్ధతిలో అనుమతి ఇచ్చిందని మీడియాకు చెప్పడంతో పలు కథనాలు వెలువడ్డాయి. మొత్తమ్మీద అధికారులు ఆ కథనాలకు స్పందించారు. రెవెన్యూ, మున్సిపల్, సర్వే, ఇరిగేషన్శాఖల అధికారులు సంయుక్తంగా ఆ భవంతి నిర్మాణ పనులను క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించారు. అన్ని అనుమతులు సక్రమంగానే ఉన్నాయని అధికారులు తేల్చారు.
మాజీకౌన్సిలర్లు, చోటా నేతల ఫిర్యాదులతో అధికారులు విసుగెత్తిపోతున్నారు. పటాన్చెరు అమీన్పూర్ మండల పరిధిలో ఇలాంటి సమస్యలు ఎక్కువగా ఉన్నాయని అధికారులు చెప్తున్నారు. అమీన్పూర్లో మరో ఘటనలో ఓ బిల్డర్ రెసిడెన్షియల్ బిల్డింగ్ కోసం హెచ్ఎండీఏ అనుమతులతో భవంతి నిర్మాణం చేసుకున్న తర్వాత కమర్షియల్గా మార్చారు. ఆ భవన నిర్మాణ యజమానికి మున్సిపల్ అధికారులు నోటీసులు ఇచ్చారు. తప్పు చేస్తున్నావని హెచ్చరించారు. దాంతో ఓ మాజీ ప్రజాప్రతినిధి ఆ భవంతికి అండగా నిలిచారు. ఆయన చేసిన తప్పేమీ లేదని ప్రెస్మీట్ పెట్టారు. అధికారులకు నియోజకవర్గస్థాయి ప్రజాప్రతినిధితో ఫోన్ కూడా చేయించారు. ఆ అక్రమ భవంతిని సక్రమం చేసేందుకు ఓ నేత డబ్బులు కూడా డిమాండ్ చేశారని చెప్తున్నారు. ఇదిలాఉండగా అమీన్పూర్ పరిధిలోని వాణీనగర్, హెచ్ఎంటీ కాలనీలో పార్టీలకతీతంగా నేతలు బిల్డర్లను బెదరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అమీన్పూర్ పట్టణ పరిధిలో విలీనమైన కిష్టారెడ్డిపేట, పటేల్గూడలో అక్రమ నిర్మాణాలను నిలువరించడంలో అధికారులు విఫలమవుతున్నారు. నేతల జోక్యంతోనే సమస్యలు వస్తున్నాయని అధికార వర్గాలు చెప్తున్నాయి.
చర్యలకు అడ్డంకి..
చిట్కుల్, ఇంద్రేశంలలో అక్రమ నిర్మాణాలకు నేతలు అండగా నిలుస్తున్నారు. నేతల అండ చూసుకుని నిర్మాణాలు సాగిస్తున్న వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేకపోతున్నట్లు మున్సిపల్ అధికారులు చెప్తున్నారు. ప్రజా సమస్యలను గాలికి వదిలి అక్రమ భవంతులకు వత్తాసు పలుకుతున్న నేతలను చూసి స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
అక్రమ నిర్మాణలను అడ్డుకోవాల్సిన
ప్రజాప్రతినిధులే వాటికి వంత పాడుతుండటంతో అధికారులు అవాక్కవుతున్నారు. పటాన్చెరు మండలంలోని ఇంద్రేశం, అమీన్పూర్ మున్సిపాలిటీల్లో ఈ తంతు జోరుగా
సాగుతుండటం గమనార్హం. అయినా ఉన్నతాధికారులు కళ్లప్పగించి చూస్తున్నారే కానీ అడ్డుకట్ట వేయలేకపోతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
