బొమ్మ, బొరుసు జూదంపై దాడి
ఏడుగురు అరెస్ట్
వట్పల్లి(అందోల్): బొమ్మ, బొరుసు జూదం ఆడుతున్న వారిపై శనివారం రాత్రి జోగపేట పోలీసులు దాడి చేసి ఏడుగురిని ఆదుపులోకి తీసుకున్నారు. ఎస్ఐ పాండు కథనం ప్రకారం అందోల్ మండల పరిధి ఎర్రారం గ్రామ శివారులో బొమ్మ, బొరుసు ఆడుతున్నట్లు వచ్చిన సమాచారం వచ్చింది. ఈ మేరకు దాడి చేసి జూదం ఆడుతున్న ఏడుగురిని అదుపులోకి తీసుకొని వారి నుంచి రూ.34, 840 నగదు, 7 సెల్ఫోన్స్, మూడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకొని సీజ్ చేసినట్లు ఎస్ఐ తెలిపారు.
హక్కుల సాధనకు పోరాటం
జహీరాబాద్ టౌన్: బీసీల హక్కుల సాధన కోసం ఐక్యపోరాటాలు చేయాలని జేఏసీ నాయకులు కోరారు. పట్టణంలో శనివారం జేఏసీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు కొండపురం నర్సింలు, పెద్దగొల్ల నారాయణ తదితరులు మాట్లాడుతూ.. గ్రామస్థాయి నుంచి జేఏసీని బలోపేతం చేయాలన్నారు. ప్రభుత్వ పథకాలు బీసీ వర్గాలకు అందేలా జేఏసీ కృషి చేయాలని కోరారు.
వాహన తనిఖీ కొనసాగించాలి
పటాన్చెరు టౌన్: వాహనాల తనిఖీలు నిరంతరం కొనసాగించాలని నవ భారత్ నిర్మన్ యువసేన వ్యవస్థాపక అధ్యక్షుడు మెట్టు శ్రీధర్ డిమాండ్ చేశారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. కర్నూల్ బస్సు ప్రమాద ఘటనలో పలువురు మరణించడంపై దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. అధికారులు ప్రమాదాలు జరిగిన సమయంలో తనిఖీలు చేసి చేతులు దులుపుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలా కాకుండా నిరంతరం ఈ ప్రక్రియ కొనసాగించాలన్నారు. ట్రావెల్స్ యాజమాన్యాలు బరితెగించి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
పంచముఖి ఆలయంలో చోరీ
పటాన్చెరు టౌన్: పంచముఖి ఆలయంలో గుర్తుతెలియని దుండగులు కేజీ వెండి కిరీటం, అమ్మవారి బంగారు తాళి, హుండీలోని నగదును ఎత్తుకెళ్లిన సంఘటన అమీన్పూర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికులు కథనం ప్రకారం.. అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని పటేల్గూడా మెట్రో ఎంక్లేవ్లోని పంచముఖి దేవాలయంలో శనివారం తెల్లవారుజామున గుర్తుతెలియని దుండగులు ఆంజనేయస్వామికి అలంకరించిన వెండి కిరీటం, అమ్మవారి బంగారు తాళి, హుండీలోని లక్ష రూపాయల నగదును ఎత్తుకెళ్లారు. ఈ క్రమంలో ఉదయం పూజ చేసేందుకు అర్చకులు వచ్చి చూడగా గుడి తలుపులు తెరిచి ఉన్నాయి. లోనికి వెళ్లి చూసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఆలయ అర్చకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
రక్తదాన శిబిరం
సంగారెడ్డి క్రైమ్: పోలీసుల అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా సంగారెడ్డి పోలీస్ గ్రాండ్లో శనివారం నిర్వహించిన రక్తదాన శిబిరానికి స్పందన లభించింది. పట్టణ పోలీస్స్టేషన్ పరిధిలోని పలువురు కానిస్టేబుళ్లు, పలువురు యువకులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. పోలీసులతో పాటు స్థానిక యువకులు 20 మంది నుంచి ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బంది రక్తాన్ని సేకరించారు.
దరఖాస్తుల ఆహ్వానం
చేర్యాల(సిద్దిపేట): జిల్లా వ్యాప్తంగా పలు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ఐదవ తరగతి నుంచి 9వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్లకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సమన్వయ అధికారి నర్సింహచారి తెలిపారు. గురుకుల పాఠశాలల్లో కొన్ని కేటగిరిల్లో పరిమిత సీట్లు ఖాళీగా ఉన్నాయని, అర్హత కలిగిన బాల, బాలికలు ఈ నెల 28వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.


