
సర్కారు బడికి ఆదరణ అదరహో!
● బడిబాటలో 14,215 మంది ప్రవేశాలు ● అత్యధికంగా జహీరాబాద్ మండలంలో
న్యాల్కల్(జహీరాబాద్): సర్కార్ బడుల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఫలితాన్నిస్తున్నాయి. బడుల్లో మౌలిక వసతులు కల్పించడంతో పాటు నాణ్యమైన విద్యనందించేందుకు కృషి చేయడంతోపాటుగా ఉచిత పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్స్ తదితరాలను సకాలంలో విద్యార్థులకు అందిస్తుండటంతో సర్కారు బడుల్లో ప్రవేశాలు పెరుగుతున్నాయి. విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని నిర్వహించిన బడిబాట కార్యక్రమం విద్యార్థుల తల్లిదండ్రుల వైఖరిలో మార్పును తెచ్చిపెచ్చినట్లు కనిపిస్తోంది. బడిబాట కార్యక్రమంలో అధికారులు, నాయకులు, ఉపాధ్యాయులు, అంగన్వాడీ కార్యకర్తలు భాగస్వాములు కావడంతో మంచి స్పందన లభించింది.
బడిబాటతో పెరిగిన ప్రవేశాలు
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ఆచార్య జయ శంకర్ బడిబాట ఈ నెల 6న ప్రారంభ 19 వ తేదీ వరకు కొనసాగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఇల్లిల్లు తిరిగి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలు, ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్, మధ్యాహ్న భోజనం, అర్హత కలిగిన ఉపాధ్యాయులతో బోధన, నాణ్యమైన విద్య తదితర అంశాలపై విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. దీంతో బడి బాటలో 14,215 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు. ఒకటవ తరగతిలో 5,423 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందగా మిగిలిన 8,792 విద్యార్థులు ఇతర తరగతుల్లో చేరారు.
ఇంకా లక్ష్యానికి దూరంగా పదివేలకు పైనే...
జిల్లాలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత, ఆదర్శ పాఠశాలలతో కలిపి మొత్తం 1,249 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. ఆయా పాఠశాలల్లో 1,09,319 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. 2025–2026 ఏడాదికి గాను సుమారు 25వేల మంది విద్యార్థులను బడుల్లో చేర్పించాలని లక్ష్యం పెట్టుకోగా ఇప్పటివరకు 14,215 మంది విద్యార్థులు అడ్మిషన్ పొందారు. ఇంకా 10,785 మంది విద్యార్థులు అడ్మిషన్ పొందవలసి ఉంది. ఐతే ప్రవేశాల ప్రక్రియ ఆగస్టు నెలాఖరు వరకు ఉన్నందున అప్పటివరకు లక్ష్యాన్ని పూర్తి చేస్తామని అధికారులు ధీమాను వ్యక్తం చేస్తున్నారు. బడిబాటలో ప్రైవేట్ పాఠశాలల నుంచి 2,230 మంది ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు. జిల్లాలో అత్యధికంగా జహీరాబాద్ మండలంలో 1,374 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందగా, పటాన్చెరులో 1,095 మంది, జిన్నారంలో 1,092 మంది విద్యార్థులు బడుల్లో చేరారు. గతేడాది 13వేల మంది విద్యార్థులు చేరగా ఈ ఏడాది 19వ తేది నాటికి 14,215 మంది విద్యార్థులు ప్రవేశం పొందినట్లు అధికారులు తెలిపారు.
ఆగస్టు నెలాఖరు వరకు ప్రవేశాలు
ఈనెల 6 నుంచి నిర్వహించిన బడిబాటతో మంచి ఫలితాలు వచ్చాయి. గతేడాది కంటే ఈ ఏడాది అధికంగా విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు. అడ్మిషన్ల ప్రక్రియ ఆగస్టు నెలాఖరు వరకు కొనసాగుతుంది. ప్రభుత్వ బడుల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించడంతోపాటు పుస్తకాలు, ఏకరూప దుస్తులు తదితరాలను అందిస్తున్నందున తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పించేందుకు తల్లిదండ్రులు మొగ్గుచూపుతున్నారు. వెంకటేశ్వర్లు, జిల్లా విద్యాధికారి, సంగారెడ్డి

సర్కారు బడికి ఆదరణ అదరహో!