
అవే వినతులు!
జిల్లా అధికారులు రావాల్సిందే..
ప్రజావాణి కార్యక్రమం నిర్వహణ విషయంలో జిల్లా ఉన్నతాధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. పలు శాఖల జిల్లా ఉన్నతాధికారులు ఈ ప్రజావాణికి రాకుండా తమ కింది స్థాయి సిబ్బందిని పంపుతున్నారు. స్థానికంగా ఉండకుండా హైదరాబాద్ నుంచి రాకపోకలు సాగిస్తున్న ఈ అధికారులు ప్రతీ సోమవారం ప్రజావాణి ఎగనామం పెట్టడం సాధారణమైపోయింది. దీన్ని గమనించిన కొత్త కలెక్టర్ ప్రావీణ్య తప్పనిసరిగా ఆయా శాఖ జిల్లా ఉన్నతాధికారులే స్వయంగా ప్రజావాణికి రావాలని ఆదేశాలు జారీ చేశారు. కారణం లేకుండా కిందిస్థాయి సిబ్బందిని పంపితే చర్యలు తప్పవని హెచ్చరించారు.
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి : భూ భారతి రెవెన్యూ చట్టం అమలులో భాగంగా మూడు రోజుల క్రితం వరకు జిల్లా వ్యాప్తంగా గ్రామగ్రామాన రెవెన్యూ సదస్సులు జరిగాయి. ఈ సదస్సుల్లో తమ భూ సమస్యల పరిష్కారం కోసం ఏకంగా వేలల్లో దరఖాస్తులు వచ్చాయి. ఈ సదస్సులు ముగిసి మూడు రోజులు కాకముందే సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో అవే భూసమస్యలపై అత్యధికంగా దరఖాస్తులు రావడం గమనార్హం. పి.ప్రావీణ్య కలెక్టర్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత జరిగిన రెండో ప్రజావాణి కార్యాక్రమానికి సోమవారం పెద్ద సంఖ్యలో జిల్లా వాసులు తరలివచ్చిన వినతిపత్రాలు అందజేశారు. జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల నుంచి వచ్చిన దరఖాస్తుదారులతో కలెక్టరేట్ కిటకిటలాడింది. పెద్ద ఎత్తున క్యూ దర్శనమిచ్చింది.
ఆన్లైన్లో నమోదైన 1,436 అర్జీలు
జిల్లాలో జూన్ 3వ తేదీ నుంచి 20వ తేదీ వరకు భూభారతి రెవెన్యూ సదస్సులు జరిగిన విషయం విదితమే. మొత్తం 574 గ్రామాల్లో నిర్వహించిన సదస్సుల్లో 13,888 దరఖాస్తులు వచ్చాయి. తమ భూ సమస్యలను పరిష్కారించాలని కోరుతూ ప్రజలు ఈ దరఖాస్తులు చేసుకున్నారు. ముందుగా పైలెట్ మండలాల్లో సదస్సులు నిర్వహించిన అధికారులు ఆ తర్వాత అన్ని మండలాల్లో ఈ సదస్సులు చేపట్టారు. ఈ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను రెవెన్యూ అధికారులు ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. ఇప్పటివరకు 1,436 దరఖాస్తులను ఆన్లైన్లో పొందుపరిచారు. మిగిలిన వాటినికి కూడా ఆన్లైన్ చేయనున్నారు.
ప్రజావాణిలోనూ అవే
రెవెన్యూ సదస్సు ముగిసి కేవలం మూడు రోజుల వ్యవధిలోనే ప్రజావాణి కార్యక్రమంలో ఈ భూసమస్యల దరఖాస్తులే వెల్లువెత్తాయి. మొత్తం 71 దరఖాస్తులు రాగా, ఇందులో 32 దరఖాస్తులు భూసమస్యలకు సంబంధించినవేనని రెవెన్యూ అధికారులు పేర్కొంటున్నారు. సుమారు 52 శాఖలకు కలిపి 71 దరఖాస్తులు వస్తే..రెవెన్యూశాఖకు సంబంధించిన భూ సమస్యల దరఖాస్తులు సుమారు సగం ఉండటం గమనార్హం. తమ సమస్య పరిష్కారం కోసం ప్రజలు చెప్పులరిగేలా తిరుగుతున్నా ప్రయోజనం లేకుండాపోతోంది. ఎంతో ఆశతో వస్తున్న జిల్లా ప్రజలు ఈసారైనా తమ సమస్య పరిష్కారం కాకపోతుందా అని కలెక్టరేట్కు వస్తున్నారు. ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న భూవివాదాలకు సంబంధించిన వినతిపత్రాలే ప్రజావాణిలో ఎక్కువగా వస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. భూమిని కొనుగోలు చేసిన వ్యక్తి రికార్డుల్లో తన పేరును పూర్తిస్థాయిలో నమోదు చేసుకోవడంలో నిర్లక్ష్యం చేసుకుంటున్నారు. దీంతో అమ్మిన వ్యక్తులు వచ్చి రికార్డుల ప్రకారం తామే ఉన్నామని, అక్రమంగా తమ భూమిని కబ్జాను చేస్తున్నారని అమ్మిన వ్యక్తులు ఇస్తున్న దరఖాస్తులు కూడా ఎక్కువగానే ఉంటున్నాయని అధికారులు చెబుతున్నారు.
భూభారతి రెవెన్యూ సదస్సుల్లో13వేలకు పైగా దరఖాస్తులు
ప్రజావాణిలోనూ భూసమస్యలపైనేఅత్యధిక వినతులు