
ప్రజావాణి అర్జీలు పరిష్కరించండి: కలెక్టర్
సంగారెడ్డి జోన్/వట్పల్లి(అందోల్): ప్రజావాణిలో వచ్చిన సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్తోపాటు ఇతర ఉన్నతాధికారులు ప్రజలనుంచి అర్జీలను స్వీకరించారు. కాగా, ఒక్కరోజులో ప్రజావాణికి 71 దరఖాస్తులు రాగా అందులో సగానికిపైగా భూ సమస్యలకు సంబంధించిన వినతులే ఉన్నాయని అధికారులు వెల్లడించారు. ఇక కొత్త కలెక్టర్ ప్రావీణ్యను జిల్లా పీఆర్టీయూ అధ్యక్షులు ఏ.మాణయ్య, ప్రధాన కార్యదర్శి ప్రభు ఆధ్వర్యంలో కలెక్టరేట్లో కలిసి మొక్కను, సంఘం డైరీని అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.
పిల్లల హక్కులు కాపాడండి
నా భార్య నేను వేర్వేరుగా జీవిస్తున్నాం. మాకు ముగ్గురు పిల్లలు. ఇద్దరు పెద్ద పిల్లలు అక్షయ శ్రీ, అక్షిత్లను చదివించకుండా వ్యవసాయ పనులతోపాటు ఇంటి పనులు చేయిస్తున్నారు. బాలల హక్కులు సంరక్షించి, పిల్లలు చదువుకునే విధంగా చర్యలు తీసుకోవాలి. – ఎర్రగొల్ల నాగరాజు, గ్రామం, సదాశివపేట
కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలి
పట్టణంలోని ప్రభుత్వ స్థలంతోపాటు రహదారులను కబ్జా చేసి అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలి. తప్పుడు పత్రాలు సృష్టించి ఇండ్లు లేకున్నా, ఇండ్ల నంబర్లు కేటాయించి స్థలాన్ని ఆక్రమిస్తున్నారు. అధికారులు కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలి.
–శ్రీధర్, వాజిద్, సంగారెడ్డి

ప్రజావాణి అర్జీలు పరిష్కరించండి: కలెక్టర్