
కోమటిచెరువు సుందరీకరణ!
ప్రక్షాళన దిశగా బల్దియా అడుగులు
● మూడు కిలోమీటర్ల పొడవునా ప్రక్రియ ● కెనాల్ ఇరువైపులా ఫుట్పాత్ ● అక్రమకట్టడాల తొలగింపు ● రేపో మాపో క్షేత్రస్థాయిలో ఆరా ● రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్ శాఖల జాయింట్ సర్వే
సిద్దిపేటజోన్: దశాబ్ధాల చరిత్ర ఉన్న సిద్దిపేట బావిష్ఖానపూల్ కోమటిచెరువు కెనాల్) ప్రక్షాళన దిశగా బల్దియా అడుగులు వేస్తోంది. సుందరీకరణ, అక్రమ కట్టడాల నియంత్రణతో మునిసిపల్ అధికారులు భవిష్యత్ ప్రణాళికను రూపొందించారు. కోమటిచెరువు మత్తడివాగును సుందరీకరణ చేసేందుకు యంత్రాంగం సన్నద్ధం అయింది. సుమారు మూడు కిలోమీటర్ల పొడవునా ఉన్న కెనాల్ను అందంగా తీర్చిద్దేందుకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగానే రెండు రోజుల్లో మున్సిపల్, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల ఆధ్వర్యంలో కెనాల్కు ఇరువైపులా జాయింట్ సర్వే చేసేందుకు సమాయత్తం అవుతున్నారు. నీటిపారుదల శాఖ నిబంధనలకు విరుద్ధంగా కెనాల్కు ఇరువైపులా నిర్మించిన అక్రమ కట్టడాల గుర్తింపు ప్రక్రియ జాయింట్ సర్వే ద్వారా తేల్చనున్నారు. కెనాల్కు ఇరువైపులా పాదచారుల నడక కోసం పాత్ వేతో పాటు రెండు పక్కలా బయో ఫెన్సింగ్ చేయాలని బల్దియా అధికారులు నిర్ణయించారు. వంద రోజుల యాక్షన్ ప్లాన్లో భాగంగా ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు.
జిల్లా కేంద్రంలోని కోమటిచెరువు మత్తడివాగు చాలా పురాతనమైనది. కోమటిచెరువు వరద నీటి ప్రవాహం మత్తడి ద్వారా ఇదే కెనాల్ మార్గం గుండా నర్సాపూర్ చెరువులోకి వెళ్లేది. ప్రస్తుతం పట్టణం పెరిగిపోతోంది. దీనితో కెనాల్ ఇరువైపులా నిర్మాణాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. మరోవైపు కెనాల్ పర్యవేక్షణ వైఫల్యం వల్ల కెనాల్ మొత్తం గుర్రపు డెక్క, చెత్త చెదారం లాంటి వాటితో నిండిపోయింది. కెనాల్ అస్తవ్యస్తంగా మారి పట్టణ సుందరీకరణకు ఆటంకంగా మారింది. వర్షాకాలంలో కోమటిచెరువు నీటి మట్టం పెరిగిపోయి, మత్తడి ద్వారా నీటి ప్రవాహం, దీనికి తోడు వర్షాల వరదనీటి ప్రవాహానికి కెనాల్లో నిండుకున్న మట్టి, గుర్రపు డెక్క అడ్డంకిగా మారుతోంది. దీనితో రోడ్లపైకి వరద నీరు ఉప్పొంగి రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారుతున్నాయి. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం బల్దియా కోమటిచెరువు కెనాల్ సుందరీకరణ ప్రక్రియ చేపట్టింది.
మూడు శాఖలతో సర్వే
కోమటిచెరువు నుంచి నర్సాపూర్ వరకు ఉన్న నీటిపారుదల శాఖ కెనాల్ హద్దులు తేల్చే లెక్కల్లో అధికారులు ఉన్నట్లు సమాచారం. నీటిపారుదల శాఖ నిబంధనల మేరకు ఇరువైపులా కెనాల్కు ఒక మార్కింగ్ ఇచ్చి భూముల అన్యాక్రాంతం కాకుండా చూడాలనే సమాలోచనలో ప్రభుత్వ అధికారులు ఉన్నారు. అందుకు సంబంధించిన రెండు, మూడు రోజుల్లో రెవెన్యూ, నీటిపారుదల, మున్సిపల్ అధికారులు జాయింట్ సర్వే చేయనున్నారు. మూడు కిలోమీటర్ల పొడవునా కెనాల్ మధ్య భాగం నుంచి ఇరువైపులా కొలతలు వేసి, నిబంధనల ప్రకారం హద్దులు నిర్ణయించాలని సంకల్పించారు. నిబంధనలు ఉల్లంఘించిన అక్రమ కట్టడాలు గుర్తించి వాటికి నోటీసులు జారీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ద్విముఖ లక్ష్యంతో...
కోమటిచెరువు కెనాల్ను సుందరీకరణ చేస్తూ. కెనాల్కు ఇరుపక్కలా ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం కాకుండా పరిరక్షణకు బల్దియా సుందరీకరణ పేరిట ప్రక్రియ చేపట్టింది. అందులో భాగంగానే కోమటిచెరువు నుంచి హైదరాబాద్ రోడ్డు బ్రిడ్జి (బావిష్ ఖాన ఫుల్) వరకు ఒక భాగంగా, అక్కడి నుంచి నర్సాపూర్ చెరువు వరకు రెండవ భాగంగా విభజన చేసింది. మూడు కిలోమీటర్ల పొడవునా ఉన్న కెనాల్లో మొదటి దశలో డెక్క, సిల్ట్, చెత్త చెదారం తొలగించి, కెనాల్కు ఇరువైపులా ఉన్న చెట్ల పొదలను తీసివేసే ప్రక్రియ చేపట్టారు. కెనాల్ను శుద్ధి చేసి తదుపరి చర్యలో కెనాల్కు రెండు వైపులా పట్టణ ప్రజలు వాకింగ్, జాగింగ్ చేసేలా పాత్ వే నిర్మాణం, ఇరుపక్కలా గచ్చకాయ చెట్లతో బయో ఫెన్సింగ్ చేయనున్నారు. అక్కడక్కడ వివిధ రకాల మొక్కలు నాటేందుకు ప్రణాళికలు తయారు చేశారు. కెనాల్ ఆద్యంతం ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా అధికారులు మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
యాక్షన్ ప్లాన్లో భాగంగా..
వంద రోజుల యాక్షన్ ప్లాన్లో భాగంగా కోమటిచెరువు కెనాల్ బ్యూటిఫికేషన్ ప్రక్రియ చేపట్టాం. వర్షాకాలంలో వరద నీటి ప్రవాహనికి అడ్డంకులు లేకుండా కెనాల్ శుద్ధి చేస్తాం. ఇరువైపులా పాత్ వే, బయో పెన్సింగ్ ఏర్పాటు చేసి, ప్రభుత్వ భూమి కబ్జాకు గురికాకుండా చూస్తాం. త్వరలో జాయింట్ సర్వే జరగనుంది.
–ఆశ్రిత్ కుమార్, మున్సిపల్ కమిషనర్

కోమటిచెరువు సుందరీకరణ!

కోమటిచెరువు సుందరీకరణ!