
విద్యార్థుల సంఖ్యను పెంచాలి
● ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాల గురించి వివరించండి ● ఎంఈవోలు రోజుకు రెండు పాఠశాలలు తనిఖీ చేయాలి ● కలెక్టర్ ప్రావీణ్య ఆదేశం ● ఎంఈఓ, కస్తూర్బా ఎస్ఓలతో సమీక్ష
సంగారెడ్డి ఎడ్యుకేషన్: జిల్లాలో బడిబాట కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు కృషి చేయాలన్నారు. సోమవారం ఎంఈఓలు కస్తూర్బా పాఠశాలల ప్రత్యేక అధికారుల బడిబాట, మనఊరు– మనబడి, పాఠశాల విద్యా పటిష్టత కోసం తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు సర్కార్ కల్పిస్తున్న సౌకర్యాలు , విద్యార్థుల తల్లిదండ్రులకు వివరించి వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి ఉపాధ్యాయుడు వార్షిక విద్యా క్యాలెండర్ను పూర్తిగా అమలు చేయాలన్నారు. తనిఖీలకు వెళ్లినప్పుడు సమస్యలను విద్యార్థులను స్వయంగా అడిగి తెలుసుకోవాలని సూచించారు.
ఆర్థిక పరిస్థితుల కారణంగా మధ్యలో చదువుకోవడం ఆపేసిన బాలికలను ఆయా మండలాలలో గల కస్తూర్బా పాఠశాలల్లో చేర్పించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎంఈఓలు ప్రతిరోజు కనీసం రెండు పాఠశాలలను తనిఖీ చేయాలన్నారు. ఉపాధ్యాయుల పనితీరు, విద్యార్థుల హాజరు శాతం ఉపాధ్యాయుల బోధనకు విద్యార్థులు ఏ విధంగా సన్నద్ధమవుతున్నారు.. తదితర విషయాలను గమనించాలన్నారు. ప్రతిరోజు స్కూల్ ఎడ్యుకేషన్ యాప్లో తనిఖీ వివరాలు నమోదు చేయాలని చెప్పారు. మనఊరు– మనబడి కార్యక్రమంలో చేపట్టిన పనులు అసంపూర్తిగా ఉన్నచోట వెంటనే పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఇప్పటి వరకు 3429 మంది విద్యార్థులు వివిధ కళాశాలలో చేరినట్లు తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాశాఖ అధికారి గోవిందరావు, టీజీ ఈడబ్ల్యుఐడీసీ అధికారి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.