
పైసలిస్తేనే రిజిస్ట్రేషన్ !
● భూమి గిఫ్ట్ రిజిస్ట్రేషన్ కోసం నాలుగురోజులుగా ఓ మహిళ ప్రదక్షిణలు ● ఖేడ్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట గిరిజన మహిళ ఆందోళన ● లంచం అడగలేదని తహసీల్దార్ వివరణ
నారాయణఖేడ్: మనవళ్ల పేరిట భూమిని గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని వస్తే.. పైసలిస్తేనే గానీ పనికానిచ్చేది లేదని అధికారులు నాలుగైదు రోజులుగా కార్యాలయం చుట్టూ తిప్పించుకుంటు న్నారు. దీంతో తహసీల్దార్ కార్యాలయం ఎదుట సదరు మహిళ ఆందోళనకు దిగింది. ఖేడ్ మండలంలో సోమవారం వెలుగు చూసిన ఈ ఘటన వివరాలు బాధితుల కథనం మేరకు ఇలా ఉన్నాయి. కొండాపూర్ స్కూల్ తండాకు చెందిన లక్ష్మీబాయికి ఖేడ్ మున్సిపల్ పరిధిలోని మన్సుర్పూర్ శివారులో ఎకరం భూమి ఉంది. ఈ భూమిని తన మనవళ్లు అయిన వినోద్, శ్రీకాంత్ల పేరుపై గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేయించేందుకు నాలుగు రోజుల క్రితం ఖేడ్ రెవెన్యూ కార్యాలయానికి వెళ్లింది. ఆయా రికార్డులు పరిశీలించిన అధికారులు రిజిస్ట్రేషన్కు సంబంధించి నమోదు చేసుకుని స్లాట్ బుక్ చేసి ఫొటోలు కూడా తీసుకున్నారు. రిజిస్ట్రేషన్ కోసం సోమవారం రావాల్సిందిగా లక్ష్మీబాయికి అధికారులు చెప్పగా...అక్కడ్నుంచి వెళ్లిపోయింది. అధికారులు చెప్పిన ప్రకారం సోమవారం కార్యాలయానికి వచ్చిన లక్ష్మీబాయి రిజిస్ట్రేషన్ కోసం ఎదురుచూసింది. అయితే డబ్బులు ముట్టజెబితేనే రిజిస్ట్రేషన్ చేస్తామని తహసీల్దార్ హసీనాబేగం చెప్పడంతో విసిగిపోయిన లక్ష్మీబాయి తన కుటుంబ సభ్యులతో కలసి కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగింది. భూమి రిజిస్ట్రేషన్ చేసేంతవరకు ఆందోళన విరమించేది లేదని తెగేసి చెప్పగా సిబ్బంది వచ్చి ఆమెకు సర్దిచెప్పారు. విషయం తెలుసుకున్న ‘సాక్షి’ఈ ఘటనపై తహసీల్దార్ హసీనాబేగంను వివరణ అడగగా...ముడుపుల కోసం లక్ష్మీబాయిని తను వేధించలేదని, మొత్తం మనవళ్ల పేరుమీద భూమి రిజిస్ట్రేషన్ చేస్తే ఆమె జీవనాధారం ఏమిటని మాత్రమే అడిగానని చెప్పారు. ఇక లక్ష్మీబాయి కూతుళ్లను కూడా రిజిస్ట్రేషన్కు తీసుకురావాలని స్పష్టం చేసినట్లు తెలిపారు.