
షాపింగ్కు వెళ్తుండగా రోడ్డు ప్రమాదం
● ఎదురెదురుగా రెండు బైక్లు ఢీ ● కిందపడ్డ వారిపై నుంచి వెళ్లిన లారీ ● తండ్రితోపాటు కుమారుడు,మరో చిన్నారి మృతి ● నలుగురికి గాయాలు ● నర్సాపూర్ మండలంలో ఘటన
నర్సాపూర్ రూరల్: రోడ్డు ప్రమాదంలో వ్యక్తితోపాటు అతడి కుమారుడు, సమీప బంధువైన చిన్నారి మృతి చెందిన ఘటన మెదక్ జిల్లా నర్సాపూర్ మండలంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. కౌడిపల్లి మండలం వెంకట్రావుపేటకు చెందిన మాల గోపాల్(32), భార్య పూజ, కూతురు ఆద్యశ్రీ, కుమారుడు అనుదీప్(5), అతడి తోడళ్లుడి కూతురు సహస్ర(8) ఐదుగురు కలిసి శనివారం ఒకే బైక్పై ఇంటి నుంచి బయలు దేరి నర్సాపూర్లో షాపింగ్ చేసేందుకు వెళ్తున్నారు. అలాగే కౌడిపల్లి మండలం కంచన్పల్లికి చెందిన దుంపల కరుణాకర్ భార్య వరలక్ష్మీతోపాటు నర్సాపూర్ నుంచి తమ గ్రామానికి బైక్పై వెళ్తున్నాడు. మార్గమధ్యలో నర్సాపూర్ మండలంలోని చిన్నచింతకుంట గేట్ సమీపంలోకి రాగానే రెండు బైక్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో గోపాల్ బైక్పై ఉన్న వారందరూ కిందపడ్డారు. వీరి వెనుకాలే మెదక్ నుంచి వస్తున్న లారీ గోపాల్, అనుదీప్, సహస్ర మీది నుంచి వెళ్లడంతో నుజ్జునుజ్జయ్యి అక్కడికక్కడే మృతి చెందారు. గోపాల్ భార్య పూజ ఎడమ కాలు విరుగగా, కూతురు ఆద్యశ్రీకి తీవ్ర గాయాలయ్యాయి. మరో బైక్పై ఉన్న కరుణాకర్, వరలక్ష్మీకి స్వల్ప గాయాలయ్యా యి. స్థానిక ఎస్ఐ లింగం ఆధ్వర్యంలో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లారీని అదుపులోకి తీసుకున్నారు.
కూలి పనులు చేస్తూ కుటుంబ పోషణ
మృతుడు మాల గోపాల్ కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కుటుంబ పెద్ద దిక్కును కోల్పోవడంతోపాటు కుమారుడు చనిపోవడంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. గోపాల్ తోడళ్లుడు సుధాకర్ సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల్ల మండలం బొంతపల్లి గ్రామంలో ఉంటున్నాడు. ఇతడి కూతురు సహస్ర పాఠశాలలకు వేసవి సెలవులు రావడంతో వెంకట్రావ్పేటలోని బంధువుల ఇంటికొచ్చి మృత్యువాత పడింది.