సాక్షి, రంగారెడ్డిజిల్లా: రైతులకు అత్యంత పారదర్శకమైన, సులభమైన సేవలు అందించేందుకు ప్రభు త్వం సమీకృత భూ భారతి పోర్టల్ (ఇంటిగ్రేటెడ్ డిజిటల్ ల్యాండ్స్ రికార్డ్స్ మేనేజ్మెంట్ సిస్టం)ను ఏప్రిల్ 2 నుంచి అమల్లోకి తీసుకురాబోతోంది. ఇందుకు ప్రయోగాత్మకంగా జిల్లాలోని ఆమనగల్లు మండలాన్ని ఎంపిక చేసింది. ఇప్పటి వరకు వేర్వేరుగా ఉన్న రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, ఎన్ఐసీ, సర్వే విభాగాలను ఇకపై ఒకే గొడుగు కిందికి తేనుంది. ఈ పైలెట్ ప్రాజెక్ట్ విజయవంతమైతే.. తర్వాత జిల్లాలోని మిగిలిన మండలాల్లోనూ దీన్ని అమలు చేయబోతోంది. దీనిలో భాగంగా ప్రతి సర్వే నంబర్కు ఆధార్ నంబర్ తరహాలోనే భూధార్ నంబర్ జారీ చేయనున్నారు. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా ఐదు గ్రామాల్లో సర్వే చేయించి, భూధార్ను కేటాయించారు. ఆధార్తో అనుసంధానమైన మొబైల్ నంబర్తో లాగిన్ అయిన వెంటనే సంబంధిత సమాచారమంతా లభిస్తోంది. ఈ పోర్టల్లో ప్రధానంగా సమాచార, సర్వే, కరెక్షన్, అప్పీల్, రిజిస్ట్రేషన్ సేవలు అందుబాటులో ఉంటాయి. వీటితో పాటు సిటిజన్ డ్యాష్బోర్డు సేవలు పొందొచ్చు. భూ భారతిలో 36 మాడ్యూల్స్ ఉండగా, భూ భారతిలో ఒకే గొడుగు కిందికి తెచ్చిన విషయం తెలిసిందే.
ఒక్కో కమతానికి ఒక్కో నంబర్
కందుకూరు డివిజన్ పరిధిలోని ఆమనగల్లు మండలంలో 13 గ్రామ పంచాయతీలు, ఒక మున్సిపాలిటీ ఉంది. భూ సమస్యలకు సంబంధించి భూ భారతి పోర్టల్కు ఇప్పటి వరకు 6,595 దరఖాస్తులు అందాయి. వీటిలో 3,089 సమస్యలకు పరిష్కార మార్గం చూపించారు. 2,536 అభ్యర్థనలను అధికారులు తిరస్కరించారు. ప్రస్తుతం పోర్టల్లో 275 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. వీటిలో తహసీల్దార్ వద్ద 149 పెండింగ్లో ఉండగా, ఆర్డీఓ వద్ద 25, అదనపు కలెక్టర్ వద్ద 71, కలెక్టర్ వద్ద 30 దరఖాస్తులు ఉన్నాయి. క్షేత్రస్థాయి నుంచి రిపోర్టులు రాక కొన్ని నిలిచిపోతే..అధికారుల అలసత్వంతో మరికొన్ని ఆగిపోయాయి. త మ సమస్యలు పరిష్కరించాల్సిందిగా కోరుతూ బాధితులు కలెక్టరేట్ చుట్టూ తిరిగినా ఫలితం ఉండటం లేదు. పెద్దల సిఫార్సులు, అడిగినంత ముట్టజెప్పిన వాళ్లకు పెద్దపీట వేస్తూ సాధారణ, మధ్య తరగతి భూ బాధితులను ఏళ్ల తరబడి ఆఫీసు చుట్టూ తిప్పుకొంటుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సమీకృత భూభారతి పోర్టల్లో భాగంగా ప్రభుత్వం ఈ మండలాన్ని పైలెట్ ప్రాజెక్ట్గా ఎంపిక చేసింది. ప్రభుత్వ, అటవీ, అసైన్డ్, లావణి, భూదాన్, వక్ఫ్ భూములతో పాటు పట్టా భూములకు సర్వే నంబర్ల వారీగా పక్కాగా హద్దులు నిర్ధారించి, ఆ వివరాలను భూభారతి పోర్టల్ సహా సబ్రిజిస్ట్రార్ పోర్టల్, సర్వే లాండ్స్ పోర్టల్లో నమోదు చేయనున్నారు. హద్దుల నిర్ధారణతో పాటు విస్తీర్ణంలో హెచ్చు తగ్గుల సమస్య కూడా పరిష్కారం కాబోతోంది. ప్రతి కమతానికి ఒక ప్రత్యేక నంబర్ను కేటాయించడం ద్వారా భూ యజమాని పేరు సహా విస్తీర్ణం, పక్కాగా నిర్ధారించిన హద్దులు, మ్యాప్, భూ స్వ రూపం తెలిసిపోతోంది.
సర్వే నుంచి రిజిస్ట్రేషన్ వరకు..
ఇక అన్నీ ఒకే గొడుగు కిందకు
ఏప్రిల్ 2 నుంచి అమల్లోకి భూ భారతి
పైలెట్ ప్రాజెక్టుగా ఆమనగల్లు మండలం ఎంపిక
ప్రతి సర్వే నంబర్కు ఆధార్ తరహా భూధార్ నంబర్ కేటాయింపు


