అపార్ట్‌మెంట్‌లోభారీ చోరీ | - | Sakshi
Sakshi News home page

అపార్ట్‌మెంట్‌లోభారీ చోరీ

Dec 12 2025 5:46 PM | Updated on Dec 12 2025 5:46 PM

అపార్ట్‌మెంట్‌లోభారీ చోరీ

అపార్ట్‌మెంట్‌లోభారీ చోరీ

రూ. 70 లక్షల నగదు, నగలు మాయం

మలక్‌పేట: ఓ కుటుంబం విహార యాత్రకు వెళ్లి వచ్చేసరికి దొంగలు ఇంటి తాళాలు పలుగొట్టి లోపలికి చొరబడి ఇళ్లు గుల్ల చేశారు. అల్మారాలోని రూ. 45 లక్షలు నగదు, బంగారు బిస్కెట్లు, బంగారు అభరణాలు 15 తులాలు, 4 కిలోల వెండిని దోచుకెళ్లారు. ఈ సంఘటన మలక్‌పేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు..అక్బర్‌బాగ్‌ డివిజన్‌ ప్రొఫెసర్స్‌ కాలనీలోని మానస అపార్ట్‌మెంట్‌లో మంత్రవాది వెంకటరమణ కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నారు.గతనెల 13న కుటుంబం విహార యాత్రకు వెళ్లి ఈనెల 10న రాత్రి తిరిగి వచ్చారు. ఇంట్లోకి వెళ్లిన తరువాత చోరీ జరిగినట్లు గమనించారు. వెనుకవైపు బాల్కనీ తలుపులు పగులగొట్టి ఉన్నాయి. బాధితుడు బీరువాలో చూడగా పగులగొట్టి ఉంది. అల్మారాలో ఉన్న రూ. 45 లక్షలు నగదు, బంగారు బిస్కెట్లు 10 తులాలు, బంగారు గాజులు 2 తులాలు, బంగారు నాణేలు 3 తులాలు, 4 కిలోల వెండి కన్పించలేదు. దీంతో మలక్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు క్లూస్‌ టీమ్‌ను రప్పించి వేలిముద్రలు, ఆధారాలు సేకరించారు.

వాచ్‌మెన్‌పై అనుమానం..

నేపాల్‌కు చెందిన అర్జున్‌ ఐదు నెలలు అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మెన్‌గా పని చేశాడు. భార్య నిర్మల, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సోదరి ఇంటికి వెళ్తున్నామని చెప్పి భార్యభర్తలు కలిసి బయటికి వెళ్లారు. భార్య అక్కడే ఉండి పోయింది. ఆ తరువాత వచ్చిన అతను నవంబర్‌ 25 తేదిన వెళ్లిపోయాడు. ఫోన్‌ చేస్తే స్విచ్ఛాఫ్‌ వస్తుంది. నేపాల్‌కు వెళ్లిపోతున్నాని చెప్పి మరో వ్యక్తిని వాచ్‌మెన్‌గా కూడా పెట్టాడని అపార్ట్‌మెంట్‌ వాసులు పేర్కొంటున్నారు. అతడే దొంగతనానికి పాల్పడి ఉంటాడని బాధితుడు అనుమానం వ్యక్తం చేస్తున్నాడు.

పోలీసులమంటూ సైబర్‌ మోసం

రూ.20వేలు టోకరా

కీసర: పోలీసులమంటూ సైబర్‌ నేరగాళ్లు ఓ పెట్రోల్‌ బంక్‌ మేనేజర్‌ను మోసం చేశారు. ఈ సంఘటన కీసర పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. కీసర సీఐ ఆంజనేయులు తెలిపిన మేరకు.. బోగారంలోని ఓ పెట్రోల్‌ బంక్‌ మేనేజర్‌ హన్మంతుకి సైబర్‌ మోసగాడు ఫోన్‌ చేసి తాను సబ్‌ ఇన్‌స్పెక్టర్‌నని కీసర ఇన్‌స్పెక్టర్‌కు ఆన్‌లైన్‌లో అర్జెంటుగా నగదు కావాలని, నగదును పెట్రోల్‌ బంక్‌ వద్దకు పంపిస్తానని చెప్పాడు. కాగా ఆ ఫోన్‌ నెంబర్‌ను ట్రూ కాలర్‌, వాట్సాప్‌లో చూడగా సీఐగా రావడంతో నమ్మి ఆ సైబర్‌ మోసగాడి స్కానర్‌కి రూ.20 వేలు పంపించాడు. అయితే బుధవారం సాయంత్రం వరకు చూసినా డబ్బు రాకపోవడంతో తాను మోసపోయానని గ్రహించి మేనేజర్‌ హన్మంతు కీసర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement