బీఆర్ఎస్ నాయకుడిపై కేసు నమోదు
ఆమనగల్లు: కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డిపై అభ్యంతరకరమైన వీడియో వాట్సాప్ గ్రూపుల్లో పోస్టు చేసిన బీఆర్ఎస్ నాయకుడిపై కేసు నమోదు చేసినట్లు ఆమనగల్లు ఎస్ఐ వెంకటేశ్ తెలిపారు. మా బాకీ ఎప్పుడు తీరుస్తారు అంటూ ఎమ్మెల్యేపై అభ్యంతరకరమైన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసిన మండలంలోని శెట్టిపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు కోట్ల సాయిబాబాపై మేడిగడ్డ తండాకుచెందిన హరిలాల్నాయక్ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ చెప్పా రు. సోషల్మీడియాలో అసత్య ప్రచారాలు, రెచ్చగొట్టే వీడియోలు పోస్టుచేస్తే చట్టప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఇంట్లో నుంచి వెళ్లి అదృశ్యం
మీర్పేట: ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన వ్యక్తి కనిపించకుండా పోయిన సంఘటన మీర్పేట పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. నందనవనం హనుమాన్నగర్ వనజ ఉషోదయ అపార్ట్మెంట్లో నివసించే నాగేశ్వర్రావు (70)కు మానసిక స్థితి సరిగా లేదు. మూడు రోజుల క్రితం ఇంట్లో నుంచి వెళ్లి తిరిగి రాలేదు. ఆచూకీ కోసం బంధువులు వెతికినా ప్రయోజనం లేకపోవడంతో పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ట్రాఫిక్ పోలీసులపై దాడికి యత్నం
ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు
అంబర్పేట: డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వ హిస్తున్న ట్రాఫిక్ పోలీసులపై దాడికి యత్నించిన ఇద్దరు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేసిన సంఘటన అంబర్పేట పోలీసు స్టేషన్ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ కిరణ్కుమార్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. శుక్రవారం రాత్రి అంబర్పేట, రామంతాపూర్ రోడ్డులోని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వద్ద కాచిగూడ ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో అంబర్పేట వైపు నుంచి బైక్పై వెళుతున్న మీసాల శ్రీనివాస్, సురేపల్లి కోటేశ్వర్రావు అనే వ్యక్తులను తనిఖీ చేయగా 100 ఎంఎల్ వచ్చింది. దీంతో వారిని వాహనం పక్కకు తీయాలని ట్రాఫిక్ ఎస్ఐ రాకేష్, కానిస్టేబుల్ పాండు సూచించారు. దీంతో ఆగ్రహానికి లోనైన వారు పోలీసులతో వాగ్వాదానికి దిగడమేగాక దాడికి యత్నించారు. వివరాలు కూడా చెప్పకుండా మీ అంతు చూస్తామంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీనిపై శనివారం ఉదయం ట్రాఫిక్ పోలీసులు అంబర్పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. స్వాధీనం చేసుకున్న వాహనాన్ని స్టేషన్లో అప్పగించారు. ట్రాఫిక్ పోలీసుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
సౌండ్ పొల్యూషన్ చేసిన ఇద్దరిపై కేసు
రాజేంద్రనగర్: అర్ధరాత్రి వేళ బ్యాండ్ భాజాలు, డీజేలతో హోరెత్తిస్తున్న ఇద్దరిపై రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సై మామిడి కిశోర్ తెలిపిన వివరాల ప్రకారం..బుద్వేల్తో పాటు రాజేంద్రనగర్ ప్రధాన రహదారిపై శుక్రవారం అర్ధరాత్రి 11 గంటల సమయంలో పెళ్లి బరాత్ ఊరేగింపును నిర్వహించారు. ఈ ఊరేగింపులో డీజే లతో పాటు పెద్ద ఎత్తున బ్యాండ్ భాజాలను ఉపయోగించారు. రాత్రి 11 గంటలు దాటినా బరాత్ ముగియకపోవడంతో స్థానికులు 100 నంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. దీంతో రాజేంద్రనగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని డీజేలను స్వాధీనం చేసుకొని పోలీస్స్టేషన్కు తరలించారు. ఇద్దరిపై సౌండ్ పొల్యూషన్ కేసు నమోదు చేశారు.


