పర్యావరణ పరిరక్షణ సామాజిక బాధ్యత
కుషాయిగూడ: పర్యావరణ పరిరక్షణ సామాజిక బాధ్యతని తెలంగాణ జైళ్లశాఖ డీజీ డాక్టర్ సౌమ్యమిశ్రా అన్నారు. శనివారం చర్లపల్లి ఖైదీల వ్యవసాయక్షేత్రంలో నిర్వహించిన వనమహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆమె మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భవిష్యత్తు తరాలను దృష్టిలో ఉంచుకుని పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. విధిగా ప్రతి ఒక్కరూ పది మొక్కలు నాటి వాటిని సంరక్షించాలన్నారు. అనంతరం ఖైదీల వ్యవసాయక్షేత్రంలోని చెరువులో చేప పిల్లలను వదిలారు. తేనెటీగలు, చేపల పెంపకం, సీడ్ బాల్ పంపిణి పర్యావరణాన్ని సమతుల్యాన్ని పెంచడానికి దోహదపడతాయన్నారు. మొక్కల పెంపకంతో పాటు పర్యావరణ సమతుల్యతను పెంచేందుకు సిబ్బంది చేస్తున్న కృషిని డీజీ అభినందించారు. కార్యక్రమంలో అర్బన్ ఫారెస్ట్ డిప్యూటీ డైరక్టర్ జి. అన్నపూర్ణ, జిల్లా అటవీశాఖ అధికారి ఎం. వేణుమాధవరావు, ఉద్యానశాఖ జాయింట్ డైరక్టర్ బాబు, కాప్రా సర్కిల్ డీసీ జగన్, సుకీర్తి, విష్ణువర్థన్రావుతో పాటుగా జైళ్లశాఖ ఐజీ ఎన్. మురళీబాబు, డీఐజీలు డాక్టర్ డి. శ్రీనివాస్, సంపత్, చర్లపల్లి జైల్, ఓపెన్ జైల్ పర్యవేక్షణాధికారులు ఎన్. శివకుమార్గౌడ్, డి. కాళిదాసు, సీకా ప్రిన్సిపల్ శ్రీనివాస్రెడ్డి, శ్రీమాన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జైళ్లశాఖ డీజీ డాక్టర్ సౌమ్యమిశ్రా


