
కేసారం ఓటర్లను చేవెళ్ల వార్డులోకే కలపాలి
చేవెళ్ల: మున్సిపాలిటీ పరిధిలో వార్డుల విభజనలో కేసారం వార్డులోని ఓటర్లను చేవెళ్ల వార్డు ఓటర్లతోనే కలపాలని ఎమ్మెల్యే కాలె యాదయ్యకు ఆ వార్డు ప్రజలు వినతి ప్రతం అందజేశారు. బుధవారం మాజీ సర్పంచ్ రమేశ్గౌడ్ ఆధ్వర్యంలో ప్రజలు, నాయకులు ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తాము ఎన్నో ఏళ్లుగా చేవెళ్ల పంచాయతీలో అనుబంధ గ్రామంగా కొనసాగామని, ఇప్పుడు మున్సిపాలిటీలో కూడా చేవెళ్ల వార్డులోనే తమ ఓట్లు ఉండాలని కోరారు. కేసారంలో 889 ఓట్లు ఉండగా మరో 600ల ఓట్లు మల్కాపూర్ నుంచి కలిపి కేసారం వార్డుగా ప్రకటించారన్నారు. తక్కువగా ఉన్న ఓట్లను మల్కాపూర్తో కాకుండా చేవెళ్లలోని ఓట్లతో కలిపి చేవెళ్ల వార్డులోనే కలిసి ఉండేలా చూడాలని కోరారు. చేవెళ్లతో 70 ఏళ్లుగా అనుబంధం ఉందని కేసారం గ్రామ పంచాయతీగా ఉన్నప్పటికీ ఆ గ్రామ ప్రజలందరూ చేవెళ్లలోనే నివాసం ఉంటున్నారన్నారు. ఇప్పుడు మున్సిపాలిటీలో కూడా చేవెళ్లతోనే తమ వార్డును కొనసాగించాలని కోరారు. కొత్త వార్డులో కలిసే ఓట్లతో ఇబ్బందులు ఏర్పడుతాయన్నారు. దీనిపై ఎమ్మెల్యే సానుకులంగా స్పందించారన్నారు. కార్యక్రమంలో కేసారంకు చెందిన ప్రజలు, నాయకులు, తదితరులు ఉన్నారు.