
బడి బడ్జెట్
బ్యాలెన్స్ తప్పిన
జూన్లో అమాంతం పెరిగిన ఖర్చు
● సర్దుబాటు చేయలేక తల్లిదండ్రుల పాట్లు ● అప్పు చేసి మరీ ఫీజుల చెల్లింపు, స్టేషనరీ కొనుగోలు ● ముగిసిన వేసవి సెలవులు ● నేటి నుంచి పాఠశాలలపునఃప్రారంభం
సాక్షి, రంగారెడ్డిజిల్లా: విజ్ఞానాన్ని పంచాల్సిన విద్యా సంస్థలు ఫక్తూ వ్యాపార కేంద్రాలుగా మారాయి. తమ పిల్లలను మంచి స్కూల్లో చేర్పించి, మంచి విద్యను అందించి, వారిని తమకంటే ఉన్నతులుగా తీర్చిదిద్దాలనే తల్లిదండ్రుల్లో ఉన్న బలహీనతను ‘క్యాష్’ చేసుకుంటున్నాయి. నిర్వహణ ఖర్చు, ఉపాధ్యాయుల వేతనాల పేరుతో ఏటా ట్యూషన్ ఫీజు పది నుంచి 25 శాతం పెంచేసి, ముక్కు పిండి మరీ వసూలు చేస్తున్నాయి. ఎవరికి వారు ప్రత్యేకవర్క్షీట్స్, పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, డ్రెస్సులు, డైరీలు, టైలు, బెల్ట్స్ తయారు చేసి పాఠశాలకు సమీపంలోనే ప్రత్యేక కౌంటర్లు తెరిచి మరీ విక్రయిస్తున్నాయి. ట్యూషన్ ఫీజు, స్టేషనరీ ధరలపై నియంత్రణ లేకపోవడంతో ఇష్టారీతిన వసూలు చేస్తున్నాయి. ఎవరైనా తల్లిదండ్రులు ఇదేమిటని ప్రశ్నిస్తే అదంతే అని నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నాయి. ఆర్థిక స్థోమత లేకపోయినా పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అప్పు చేసైనా కట్టాల్సి వస్తోంది. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు 3,203 వరకు ఉన్నాయి. వీటిలో 9,50,079 మంది విద్యార్థులు చదువుతున్నట్లు అంచనా. ప్రైవేటు పాఠశాలల్లో తమ పిల్లలను చదిస్తున్న తల్లిదండ్రులు ఖర్చుల విషయంలో బడ్జెట్ పద్మనాభంలా ఆచితూచి వ్యవహరించాల్సి వస్తోంది.