
సమస్యల ఏలు‘బడి’!
రేపటి నుంచి తెరుచుకోనున్న విద్యా సంస్థలు
ఇది షాబాద్ మండలం తాళ్లపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల. ఇక్కడ 120మంది విద్యార్థులు విద్యాభ్యాసం సాగిస్తున్నారు. భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరింది. మన ఊరు–మనబడి పథకం కింద ఎంపిక కావడంతో కాంట్రాక్టర్ మరమ్మతు పనులు మొదలుపెట్టారు. బిల్లులు రాకపోవడంతో మధ్యలోనే వదిలేశారు. చుట్టూ పిచ్చిమొక్కలు పెరిగిపోయాయి. వంటగది లేక వరండాలోనే వండాల్సి వస్తోంది. వర్షం వస్తే ఏ క్షణంలో ఏమవుతుందోనని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సాక్షి, రంగారెడ్డిజిల్లా: బడి గంటలు గురువారం నుంచి మోగనున్నాయి. పాఠశాలలు పునఃప్రారంభం కాబోతున్నాయి. ఎప్పటిలాగే ఈ విద్యా సంవత్సరం కూడా విద్యార్థులకు సమస్యలే స్వాగతం పలకనున్నాయి. గత ప్రభుత్వ హయాంలో ‘మన ఊరు–మనబడి’ పథకం కింద చేపట్టిన అదనపు తరగతి గదుల నిర్మాణం, మరుగుదొడ్లు, డైనింగ్హాల్స్ నిర్మాణ పనులు ఇప్పటికీ పూర్తి కాలేదు. పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో వారు మధ్యలోనే నిలిపివేశారు. పైసా ఖర్చులేకుండా ప్రభుత్వ పాఠశాలల్లో నిపుణులైన ఉపా ధ్యాయులతో మంచి విద్యాబోధన పొందొచ్చని భావించిన నిరుపేద విద్యార్థులకు మళ్లీ నిరాశే మిగుల్చుతోంది. ఇంగ్లిష్ మీడియంలో బోధన, ఉచిత పుస్తకాలు, యూనిఫాం, పౌష్టికాహారం అందిస్తున్నప్పటికీ మౌలిక సదుపాయాల లేమి వేధిస్తోంది. వెరసి ఆశించిన స్థాయిలో కొత్త అడ్మిషన్లు రాకపోగా, ఉన్నవి కూడా కోల్పోవాల్సి వస్తోంది. వేసవి సెలవుల కారణంగా తరగతి గదుల నిండా దుమ్ము ధూళి పేరుకుపోయాయి. మరుగుదొడ్లు, మూత్రశాలలను శుభ్రం చేసేందుకు స్కావేంజర్లు లేకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు.
నిధులు లేక నిలిచిన పనులు
● కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ స్కూళ్లను తీర్చిదిద్దాలని అప్పటి ప్రభుత్వం భావించింది. ఈ మేరకు ‘మన ఊరు– మనబడి’పథకాన్ని తీసుకొచ్చింది. పైలెట్ ప్రాజెక్ట్ కింద జిల్లెలగూడ ప్రాథమిక, ఉన్నత పాఠశాలతోపాటు శివరాంపల్లి ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను ఎంపిక చేసింది. రూ.2 కోట్లతో వీటిని తీర్చిదిద్దింది. తర్వాత మొదటి విడతలో 464 ప్రభుత్వ పాఠశాలలను ఎంపిక చేసింది. వీటిలో 448 పాఠశాలలకు రూ.99.45 కోట్ల అంచనా వ్యయంతో పనులు చేపట్టింది. రూ.30 లక్షలకు లోబడి ఉన్న 345 పాఠశాలల్లో ఇంజనీరింగ్ విభాగం ద్వారా పనులు చేపట్టింది. రూ.30 లక్షలకుపైగా అంచనా వ్యయంతో చేపట్టే పనులను టెండర్ ద్వారా చేపట్టారు. అదనపు తరగతి గదులు, ప్రహరీలు, భవనాలకు రంగులతో పాటు ఫర్నిచర్, విద్యుత్, తాగునీరు, డైనింగ్ హాల్, కిచెన్షెడ్డు వంటి మౌలిక సదుపాయాలను కల్పించాలని నిర్ణయించారు. ఆ మేరకు 30 శాతం పనులు మాత్రమే పూర్తి చేశారు 70 శాతం పనులు పెండింగ్లో ఉన్నాయి. అసంపూర్తి నిర్మాణలు, అరకొర తరగతి గదుల మధ్య ఎలా చదువుకోవాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.
తడిసి మోపైడెన అప్పులు
● యాచారం మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన చంద్రారెడ్డి అదే గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో రూ.25 లక్షలు ఖర్చు చేసి తరగతి గదులకు మరమ్మతులు చేయించాడు. పనులు పూర్తయి 18 నెలలైంది. అధికారులు ఎంబీ (మెజర్మెంట్ బుక్) కూడా రికార్డు చేశారు. ఆయనకు ఇప్పటి వరకు డబ్బులు రాలేదు.
● ఇబ్రహీంపట్నం మండలానికి చెందిన శ్రీనివాసరెడ్డి రూ.30 లక్షలు ఖర్చు చేసి శేరిగూడ జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో తరగతి గదుల మరమ్మతులు, మరుగుదొడ్ల నిర్మాణం పనులు చేపట్టారు. చేసిన అప్పులు రెట్టింపయ్యాయి కానీ పనులుకు మాత్రం బిల్లు రాలేదు.
● నాదర్గుల్కు చెందిన శివకుమార్ రూ.32 లక్షలు ఖర్చు చేసి ఆదిబట్ల జెడ్పీ స్కూల్ చుట్టూ ప్రహరీ నిర్మాణం, తరగతి గదుల మరమ్మతులు, మరుగుదొడ్ల నిర్మాణం తదితర అభివృద్ధి పనులు చేపట్టారు.బిల్లులు మాత్రం రాలేదు. ఈ పథకం కింద పనులు చేపట్టిన అనేక మంది ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు.
30 శాతం కూడా పూర్తి కాని అభివృద్ధి, మరమ్మతు పనులు చేసిన వాటికి బిల్లులు రాక నిలిపివేత ఎప్పటిలాగే ఈ ఏడాదీ తప్పని తిప్పలు అపరిశుభ్రంగా పాఠశాల ప్రాంగణాలు స్కావేంజర్లు లేక.. ఊడ్చేవాళ్లు రాక ఇబ్బంది
అభివృద్ధి పనుల అంచనా ఇలా..
అంశం కేటాయించిన బడ్జెట్
అదనపు తరగతి గదుల నిర్మాణం రూ.29,91,50,058
తాగునీటి సరఫరా పనులు రూ.5,97,34,702
ప్రహరీల నిర్మాణం రూ.4,88,70,392
విద్యుద్దీకరణ పనులు రూ.8,17,26,500
డైనింగ్ హాల్స్ రూ.20,11,31,113
టాయ్లెట్స్ విత్ రన్నింగ్ వాటర్ రూ.6,64,40,861
వంటగదుల నిర్మాణం రూ.2,39,50,261
మేజర్ అండ్ మైనర్ వర్క్స్ రూ.24,35,55,927
నిధులు లేక..
మన ఊరు–మన బడి పథకం కింద సివిల్వర్క్స్, వాటర్, శానిటేషన్, మైనర్ అండ్ మేజర్ రిపేరు, విద్యుద్దీకరణ పనులు చేపట్టారు. 80 శాతం పనులు పూర్తయినా 10 శాతం నిధులు మాత్రమే మంజూరయ్యాయి. నిధులు లేకపోవడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. ప్రభుత్వం నిధులు మంజూరు చేసి మిగతా పనులు పూర్తి చేయాలి.
– జంగయ్య,
హెచ్ఎం, కడ్తాల్ బాలుర ఉన్నత పాఠశాల

సమస్యల ఏలు‘బడి’!

సమస్యల ఏలు‘బడి’!

సమస్యల ఏలు‘బడి’!

సమస్యల ఏలు‘బడి’!