
అభివృద్ధిలో భాగస్వాములు కావాలి
● మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ అండ్ డైరెక్టర్ శ్రీదేవి
చేవెళ్ల: మున్సిపాలిటీ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ అండ్ డైరెక్టర్ టీకే శ్రీదేవి అన్నారు. వంద రోజుల ప్రణాళికలో భాగంగా మంగళవారం మున్సిపాలిటీలోని మెప్మా సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులకోసం ఉచిత వైద్యశిబిరం ఏర్పాటు చేశా రు. ఈ వైద్య శిబిరాన్ని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కొత్త మున్సిపాలిటీని అంతా కలిసి ఆదర్శంగా మార్చుకోవాలని సూచించారు. వంద రోజుల ప్రణాళికలో భాగంగా ఒక్కోరోజు ఒక్కో కార్యక్రమంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఎమ్మెల్యే కాలె యాదయ్య మాట్లాడుతూ.. మున్సిపాలిటీ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తానని తెలిపారు. అనంతరం మున్సిపాలిటీ ఆవరణలో మొక్కలు నాటారు. మెప్మా సభ్యులకు రూ.3.20 కోట్ల బ్యాంకు లింకేజీ చెక్కును అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ ప్రత్యేకాధికారి శ్రీధర్, రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సభ్యుడు చింపుల సత్యనారాయణరెడ్డి, టీపీసీసీ నాయకుడు జనార్దన్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ పూర్ణచందర్, పీఏసీఎస్ చైర్మన్ డి.వెంకట్రెడ్డి పాల్గొన్నారు.
ప్రణాళికను సమర్థవంతంగా నిర్వహించాలి
మొయినాబాద్: మున్సిపాలిటీల్లో చేపడుతున్న వంద రోజుల ప్రణాళికను సమర్థవంతంగా నిర్వహించాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ అండ్ డైరెక్టర్ టీకే శ్రీదేవి అన్నారు. మున్సిపల్ పరిధిలోని చిలుకూరులో నిర్మించిన పొడి చెత్త వేరు చేసే డీఆర్సీసీ కేంద్రాన్ని మంగళవారం ఆమె ప్రారంభించారు. అనంతరం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వర్షాకాలంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు, రోగాలు రాకుండా వంద రోజుల ప్రణాళికలో చర్యలు తీసుకోవాలన్నారు. పరిసరాల పరిశుభ్రత, తడిచెత్త, పొడి చెత్త వేరు చేయడం, సురక్షిత మంచినీటిపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో జేడీ ఫల్గున్, డీడీ శ్రీధర్, మున్సిపల్ కమిషనర్ ఖాజా మొయిజుద్దీన్, మేనేజర్ జమీర్ హైమద్ తదితరులు పాల్గొన్నారు.