
తోరణాలు కట్టి స్వాగతం పలకాలి
● పాఠశాలల ప్రారంభోత్సవం పండుగలా నిర్వహించాలి ● కలెక్టర్ నారాయణరెడ్డి
సాక్షి, రంగారెడ్డిజిల్లా: పాఠశాలల పునఃప్రారంభోత్సవం ఓ పండుగ వాతావరణంలో నిర్వహించాలని కలెక్టర్ నారాయణరెడ్డి సూచించారు. ఈ మేరకు మంగళవారం బడిబాట, వనమహోత్సవం, ఇందిరా మహిళాశక్తి అంశాలపై సంబంధిత అధికారులతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. తొలి రోజు వేడుకల్లో భాగంగా పాఠశాలలకు తోరణాలు కట్టి విద్యార్థులు, వారి తల్లిదండ్రుల కు స్వాగతం పలకాలని అన్నారు. బడి బయట ఉన్న పిల్లలను బడిలో చేర్పించి, వారికి అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచాలని, ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే అధ్యాపకులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. పాఠశాల ప్రాంగణం సహా కిచెన్, స్టోర్ రూమ్స్, తరగతి గదులన్నీ శుభ్రం చేయించాలన్నారు. పాఠశాల పునఃప్రారంభం రోజే పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, ఒక జత యూనిఫాం అందజేయాలన్నారు. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న 160 పాఠశాలల్లో ప్రత్యేక శ్రద్ధ వహించి పని చేయాలని, స్థానిక ప్రజా ప్రతినిధుల సహకారంతో పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచాలని విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. వన మహోత్సవంలో భాగంగా పండ్ల మొక్కలు నాటించాలని, ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళను సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో చేర్పించాలని సూచించారు. సమావేశంలో డీఈఓ సుశీందర్రావు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.