
బాబోయ్.. భౌభౌలు
ఆమనగల్లు: పురపాలక సంఘంలో కుక్కల బెడద పెరిగిపోయింది. గుంపులుగా సంచరిస్తూ భయాందోళనకు గురిచేస్తున్నాయి. బాటసారులపై అకారణంగా దాడులకు పాల్పడుతున్నాయి. ద్విచక్రవాహన దారులను వెంబడిస్తూ ప్రమాదాల బారిన పడేస్తున్నాయి. దీంతో ప్రజలు బయటకు రావాలంటే జంకుతున్నారు. ఆమనగల్లు మున్సిపాలిటీ పరిధి ఉదయనగర్, ఆదర్శనగర్ కాలనీలలో గ్రామ సింహాలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఎవరు కంట పడినా గుర్రుమంటూ ఓరగా చూస్తున్నాయి. హడలిస్తే దాడులకు పాల్పడుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంటినుంచి బయటకు రాలేకపోతున్నామని వాపోతున్నారు. ఇటీవల ఆదర్శనగర్ కాలనీకి చెందిన చిన్నారి రియాజ్ఖాన్పై దాడి చేసి తీవ్రంగా గాయపర్చాయని కాలనీ వాసులు తెలిపారు. వాటి భయంతో పిల్లలు ఆరు బయట ఆడుకోలేకపోతున్నారని, ఇంట్లోనే ఉండాల్సి వస్తుందని పేర్కొంటున్నారు. కొంత కాలం క్రితం శునకాల నియంత్రణకు మున్సిపాలిటీ పాలకవర్గ సభ్యులు చర్యలు తీసుకున్నారని, అయినా పదుల సంఖ్యలో కాలనీలలో తిరుగుతున్నాయని చెప్పారు. అంతే కాకుండా పందులు కూడా పెరిగిపోయాయన్నారు. ఇప్పటికై నా మున్సిపాలిటీ అధికారులు స్పందించి, కుక్కలు, పందుల బెడద నుంచి కాపాడాలని పుర ప్రజలు కోరుతున్నారు. ఇదే విషయమై కమిషనర్ శంకర్నాయక్ను వివరణ కోరగా.. వీధి కుక్కల బెడద గురించి ఉన్నతాధికారులకు నివేదిస్తామని పేర్కొన్నారు. అనంతరం వారి ఆదేశాల మేరకు తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూస్తామన్నారు.
గుంపులుగా గ్రామసింహాల సంచారం
భయాందోళనలో ప్రజలు