షాద్నగర్: మున్సిపాలిటీల్లో అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా వంద రోజుల ప్రణాళికను రూపొందించి, అమలు చేస్తోంది. రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున ప్రారంభమైన కార్యక్రమం.. సెప్టెంబర్ 10 వరకు కొనసాగనుంది.
కార్యాచరణ ఇలా..
మున్సిపాలిటీ పాలకవర్గాల గడువు ముగియడంతో ప్రభుత్వం ప్రత్యేక అధికారుల పాలన కొనసాగిస్తోంది. పట్టణ ప్రగతిపై ప్రత్యేక దృష్టి సారించింది. మున్సిపాలిటీలోని అన్ని విభాగాల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు సరికొత్త ప్రణాళికతో ముందుకు సాగుతోంది. నిత్యం అధికారులు వార్డుల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ.. ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.
పచ్చదనం పెంపునకు..
వర్షాకాలం ప్రారంభం కావడంతో పచ్చదనం పెంపొందించేందుకు చర్యలు చేపట్టారు. వార్డుల్లో, ప్రధాన కూడళ్లు, పార్కులు, మున్సిపాలిటీకి సంబంధించిన స్ధలాల్లో మొక్కలు నాటుతున్నారు. ఇంటింటికీ మొక్కలు పంపిణీ చేయనున్నారు.
వ్యాధులు ప్రబలకుండా..
వర్షాకాలం ప్రారంభం కావడంతో వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. దీంతో వీధులు, డ్రైనేజీలను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తున్నారు. ప్రతి ఇంటి నుంచి తడి పొడి చెత్తను వందశాతం వేర్వేరుగా సేకరించడం, మురుగు కాల్వల పూడిక తీత, మురుగు కుంటలు, వరద నీటి కాల్వలను గుర్తించి శుభ్రం చేస్తున్నారు. దోమల నివారణకు మందు పిచికారీ చేసి, పారిశుద్ధ్యాన్ని మెరుగు పర్చేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.
మహిళా శక్తి క్యాంటీన్లు
పట్టణాల్లో కొత్తగా ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. వీటిని ప్రారంభించేందుకు ఆసక్తి ఉన్న వారిని గుర్తించి, ఈ నెలాఖరు వరకు ఏర్పాటు చేయనున్నారు. అదేవిధంగా పట్టణాల్లో వీధి వ్యాపారులను గుర్తించి, వారికి రుణాలు ఇప్పించనున్నారు. కొత్తగా పొదుపు సంఘాలను ఏర్పాటుకు చేసి, మహిళల ఆర్థికాభివృద్ధికి తగిన ప్రోత్సాహాన్ని అందించనున్నారు.
అభివృద్ధి పనులకు శ్రీకారం
ఇంజినీరింగ్ విభాగంలో అభివృద్ధి పనులకు టెండర్లు నిర్వహించనున్నారు. వార్డుల్లో ఉన్న సమస్యలను అధికారులు గుర్తించి, అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. తాగునీటి సరఫరా మెరుగుపర్చడం, పైప్లైన్ లీకేజీలను గుర్తించి ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయనున్నారు. అదేవిధంగా వార్డుల్లో అక్రమ నల్లా కనెక్షన్లను గుర్తించి, వాటిని క్రమబద్ధీకరించనున్నారు. అదేవిధంగా భువన్ యాప్లో ఇళ్ల లెక్క పక్కాగా ఉండేలా చర్యలు తీసుకోనున్నారు. ప్రతి ఇంటిని యాప్లో నమోదు చేయనున్నారు.
స్వచ్ఛత పై అవగాహన
పట్టణంలో పారిశుద్ధ్యంతో పాటు, స్వచ్ఛత ఆరోగ్యం పై అధికారులు దృష్టి సారించారు. ఇందుకు వార్డులో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇంటి పరిసరాల శుభ్రత, తడి పొడి చెత్తపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. వైద్యశాఖ సమన్వయంతో క్షేత్ర స్థాయిలో వ్యాధుల వ్యాప్తిపై ఆరా తీస్తున్నారు.
కార్మికుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ
మున్సిపాలిటీల్లో పని చేస్తున్న పారిశుద్ధ్య సిబ్బంది ఆరోగ్యంపై వంద రోజుల ప్రణాళికలో ప్రత్యేక చర్యలు తీసుకోనున్నారు. ప్రవేటు ఆసుపత్రుల సహకారంతో కార్మికులకు వైద్య శిబిరాలను నిర్వహించనున్నారు. మందులు పంపిణీ చేయనున్నారు. కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐ వారి ఖాతాల్లో జమ అయ్యేలా అధికారులు చర్యలు తీసుకోనున్నారు.
అభివృద్ధికి వంద రోజుల ప్రణాళిక
వ్యాధులు ప్రబలకుండా చర్యలు
పచ్చదనం పెంపునకు మొక్కల పంపిణీ
తడి, పొడి చెత్తపై అవగాహన సదస్సులు
సెప్టెంబర్ 10వరకు ప్రత్యేక కార్యాచరణ
అందరు భాగస్వామ్యం కావాలి
పట్టణ అభివృద్ధికి ప్రభు త్వం వంద రోజుల కార్యాచరణ రూపొందించింది. ప్రణాళికను పక్కాగా అమలు చేస్తున్నాం. స్వచ్ఛతకు, అభివృద్ధిలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలి
– సునీత, మున్సిపల్ కమిషనర్, షాద్నగర్
మున్సిపాలిటీ.. మారాలిక!