
డిజిటల్ మోసాలతో దడ!
నగరంలో రోజురోజుకు సైబర్ బాధితుల సంఖ్య పెరుగుతోంది. ఆన్లైన్లో మోసగాళ్లు ఈజీగా నమ్మిస్తూ ప్రజలను దోచుకుంటున్నారు. బిజినెస్ అవకాశాలు, యూపీఐ చెల్లింపులు, పొరపాటు నగదు బదిలీలతో మోసపోయిన వారంతా ఇప్పుడు పోలీసులను ఆశ్రయిస్తున్నారు.
సనత్నగర్: నకిలీ వెబ్సైట్ ఆధారంగా ఆన్లైన్ ట్రేడింగ్లో రూ.24 లక్షలు పెట్టుబడి పెట్టి మోసపోవడంతో కలత చెందిన ఓ వ్యక్తి ఇంట్లో నుంచి వెళ్లిపోయిన ఘటన సనత్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..సనత్నగర్ ఎస్సార్టీకాలనీకి చెందిన లారెన్స్ కుమారుడు రెవరెండ్ జాన్ డి బెనోని ఆన్లైన్ ట్రేడింగ్లో రూ.24 లక్షలు పెట్టుబడి పెట్టి పోగొట్టుకున్నాడు. దీనిపై వెంటనే గచ్చిబౌలిలోని సైబరాబాద్లోని సైబర్ క్రైమ్ బ్రాంచ్లో ఫిర్యాదు చేశాడు. కానీ జాన్ డి బెనోని మానసికంగా కుంగిపోయాడు. తీవ్ర కలత చెందడంతో పాటు భయపడిపోయి ఇంట్లో ఎవరికీ చెప్పకుండా రిజిస్టర్ చేయని బ్లూ యాక్టివా–7జి వాహనం తీసుకుని వెళ్లిపోయాడు. ఇంటికి తిరిగిరాకపోవడంతో తండ్రి లారెన్స్ పలుచోట్ల వాకబు చేసినా ఫలితం లేకుండాపోయింది. దీంతో తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఒకరికి యూపీఐ పేమెంట్ చేయబోయి మరొకరికి..
తోటి కోడలుకు నగదు బదిలీ చేయాలని భావించిన మహిళ పొరపాటు మరో వ్యక్తికి రూ.51,400 పంపించగా..అతను తిరిగి ఆ మొత్తాన్ని తిరిగి పంపించడానికి నిరాకరిస్తుండడంతో బాధితురాలు సనత్నగర్ పోలీసులను ఆశ్రయించింది. ఫతేనగర్లో నివాసం ఉండే లక్ష్మణ్ గాయత్రి గత నెల 22న తన తోటి కోడలుకు రూ.51,400 బదిలీ చేయాలని భావించింది. ఈ క్రమంలో పొరపాటున మరో వ్యక్తి నెంబర్కు పంపించింది. దీంతో లక్ష్మణ్ గాయత్రి ఆ నెంబర్లోని వ్యక్తిని సంప్రదించగా ఆ నగదును తిరిగి పంపించేందుకు నిరాకరిస్తూ వస్తున్నాడు. ఎంతగా బతిమాలినా పంపించకపోవడంతో బాధితురాలు బుధవారం సనత్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
నగదు అవసరమంటూస్నేహితుడి పేరిట సందేశం..
డబ్బు అవసరం ఉందని తన స్నేహితుడి పేరిట వచ్చిన వాట్సప్ సందేశానికి స్పందించిన ఓ వ్యక్తి రూ.50 వేలు పోగొట్టుకున్నాడు. సనత్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. సనత్నగర్ జెక్కాలనీ రోడ్డనెంబర్–1లోని వాసవీ డ్రీమ్స్ అపార్ట్మెంట్లో నివాసం ఉండే శామ్యూల్ బర్నబాస్కు గత నెల 26న తన స్నేహితుడికి అత్యవసరంగా డబ్బు అవసరమంటూ వాట్సప్లో సందేశం వచ్చింది. వెంటనే తన స్నేహితుడిగా భావించి రూ.50 వేలు పంపించాడు. అనంతరం స్నేహితుడిని ఫోన్లో సంప్రదించగా, డబ్బు కావాలంటూ తాను ఎలాంటి సందేశం పంపలేదని చెప్పడంతో శామ్యూల్ అవాక్కయ్యాడు. దీంతో తాను మోసపోయానని గ్రహించి సనత్నగర్ పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
హెలికాఫ్టర్ సేవల పేరుతో టోకరా
ఇన్స్ట్రాగాం బిజినెస్ పేజీ వేదికగా ‘హెలీ’ సేవలకు సంబంధించిన ప్రకటనను చూసి ఓ వ్యక్తి రూ.34,616 కోల్పోయిన సంఘటన సనత్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. సనత్నగర్కు చెందిన నరేష్ గత నెల 27న ఇన్స్ట్రాగాం వ్యాపార పేజీని చూస్తున్న సమయంలో పాట్నా నుంచి కేదార్నాథ్కు హెలీ సేవలు అందిస్తున్నట్లుగా ఓ ప్రకటన వచ్చింది. ఆ ప్రకటనను చూసిన నరేష్ అందులో ఇచ్చిన నెంబర్ ఆధారంగా సంప్రదించాడు. అయితే ముందస్తు బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుందన్నారు. అందుకు రూ.34,616 పంపించాల్సిందిగా అవతలి వ్యక్తి చెప్పా డు. దీనిని నిజమని భావించిన నరేష్ ఆ మొత్తాన్ని యూపీఐ ద్వారా పంపించాడు. నగదును పంపించినప్పటికీ మళ్లీ చెల్లించాలని కోరారు. దీనిపై అనుమానం కలగడంతో బాధితుడు బుధవారం సనత్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇటీవలి కాలంలోభారీగా పెరిగిన ఆన్లైన్ ఫ్రాడ్స్
సొమ్ము కోల్పోతున్న అమాయకులు
ఆపై పోలీసులను ఆశ్రయిస్తున్న వైనం