నవ వధువు అదృశ్యం | - | Sakshi
Sakshi News home page

నవ వధువు అదృశ్యం

Jun 5 2025 7:46 AM | Updated on Jun 5 2025 7:29 PM

నవ వధువు అదృశ్యం

నవ వధువు అదృశ్యం

శంషాబాద్‌ రూరల్‌: ప్రేమ వివాహం చేసుకున్న నవ వధువు అదృశ్యమైన ఘటన మండల పరిధిలో చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ కె.నరేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... ఇస్తారి చేతన్‌, మౌనిక గత నెల 20న ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత ఇద్దరూ ముచ్చింతల్‌లోని వినోద్‌ గార్డెన్‌లో నివాసముంటున్నారు. ఈ నెల 1న స్నేహితుడి పెళ్లికి వెళ్లడానికి దంపతులు సిద్ధమవుతుండగా.. ఇద్దరి మధ్య చిన్న గొడవ జరిగింది. ఈ క్రమంలో ఈ నెల 3న ఉదయం చేతన్‌ డ్యూటీ కోసం తుక్కుగూడకు వెళ్లాడు. ఈ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి మౌనిక ఇంట్లోనే ఉంది. మధ్యాహ్నం మౌనికకు భర్త ఫోన్‌ చేయగా..స్విచ్చాఫ్‌ వచ్చింది. కాసేపటికి మౌనిక ఇంట్లో కనిపించడంలేదని చేతన్‌కు కుటుంబ సభ్యులు ఫోన్‌ చేశారు. దీంతో ఆమె కోసం అన్ని చోట్ల వెతికినా జాడ తెలియకపోవడంతో బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

బాలుడి అదృశ్యం 

కొందుర్గు: బాలుడు అదృశ్యమైన సంఘటన మండల పరిధి శ్రీరంగాపూర్‌ చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రామచంద్రాపూర్‌ గ్రామానికి చెందిన పిచ్చకుంట్ల అంజమ్మ, రామచంద్రయ్య దంపతుల కూతురు యాదమ్మను శ్రీరంగాపూర్‌ గ్రామానికి చెందిన చిటికెల నర్సింహులుకు ఇచ్చి 20 ఏళ్ల క్రితం వివాహం చేశారు. వీరికి శ్రీశైలం, శ్రీకాంత్‌ ఇద్దరు కుమారులు. వీరి చిన్నతనంలోనే 13 ఏళ్ల క్రితం కుటుంబ తగాదాల కారణంగా తల్లి,తండ్రి ఆత్మహత్యకు పాల్పడ్డారు. 

ఈ క్రమంలో ఇద్దరు పిల్లలు గురుకుల పాఠశాలలో చదువుకుంటున్నారు. వేసవి సెలవుల నేపథ్యంలో బాలలు ఇద్దరు స్వగ్రామంలోని నాయనమ్మ చంద్రమ్మ దగ్గరకు వచ్చారు. బుధవారం ఉదయం చిన్న మనవడు శ్రీకాంత్‌ ఇంటినుంచి వెళ్లిపోయాడు. తిరిగి రాలేదు. బంధువులు, పరిసర గ్రామాల్లో వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో బాలుడి అమ్మమ్మ అంజమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ రవీందర్‌ నాయక్‌ తెలిపారు.

రోడ్లపై గెలుపు సంబరాలు.. ఇద్దరు యువకులపై కేసు

గచ్చిబౌలి: ఐపీఎల్‌ ఫైనల్లో పంజాబ్‌ కింగ్స్‌పై ఆర్సీబీ గెలుపుతో మంగళవారం రాత్రి సంబరాలు చేసుకునేందుకు యువకులు పెద్ద ఎత్తున రోడ్లపైకి చేరుకున్నారు. కొండాపూర్‌ సిగ్నల్‌ వద్ద దాదాపు 150 మంది యువకులు బాణసంచా కాల్చుతూ వాహనాలకు దారి వ్వకుండా హల్‌చల్‌ చేసి ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగించారు. హెచ్‌సీయూ డిపోకు చెందిన రూట్‌ నెంబర్‌ 10 హెచ్‌ బస్సు సికింద్రాబాద్‌ నుంచి కొండాపూర్‌ క్రాస్‌ రోడ్డుకు చేరుకుంది. అక్కడ బస్సు యూటర్న్‌ తీసుకోవాల్సి ఉండగా యువకులు రోడ్డుపై తిష్ట వేశారు. చాలా సేపు హారన్‌ కొట్టినా పక్కకు జరగకుండా బస్సును అడ్డుకున్నారు. ఇద్దరు గుర్తు తెలియని యువకులు బస్సు ఎక్కి ముందుకు కదలకుండా చేశారు. అంతే కాకుండా వాహనాల రాకపోకలకు తీవ్ర ఆంటంకం కల్గించడంతో ట్రాఫిక్‌జాం నెలకొంది. ఈ క్రమంలో ఇద్దరు గుర్తు తెలియని యువకులు తన విధులకు ఆటంకం కల్గించారని డ్రైవర్‌ పోచయ్య గచ్చిబౌలి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ప్రేమ పేరుతో మోసం.. పోక్సో చట్టం కింద నిందితుడి అరెస్టు

బంజారాహిల్స్‌: ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ యువతితో సన్నిహితంగా ఉన్న తర్వాత... మరో యువతిని వలలో వేసుకున్న ఘటనలో నిందితుడిని బంజారాహిల్స్‌ పోలీసులు పోక్సో చట్టం కింద అరెస్టు చేసి బుధవారం రిమాండ్‌కు తరలించారు. పోలీసుల సమాచారం మేరకు... బిహార్‌కు చెందిన సునీల్‌యాదవ్‌ గచ్చిబౌలిలోని హైహోమ్‌ బుజా అపార్ట్‌మెంట్‌లో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఓ యువతి బతుకుదెరువు నిమిత్తం ఏడు నెలల క్రితం హైదరాబాద్‌కు రాగా ఆమెకు సునీల్‌ యాదవ్‌తో పరిచయం ఏర్పడింది. 

ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించిన సునీల్‌ తరచూ ఆమెను బంజారాహిల్స్‌ రోడ్డునెంబర్‌–5లోని దేవరకొండ బస్తీలో ఉన్న తన స్నేహితుడి గదికి తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇటీవల సునీల్‌ మరో యువతితో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుండడాన్ని గమనించిన బాధితురాలు ఇదేం పద్ధతి అంటూ ప్రశ్నించి గొడవ పడి తనను పెళ్లి చేసుకోవాలని నిలదీసింది. అందుకు నిందితుడు నిరాకరించడంతో తాను మోసపోయానని తెలుసుకున్న బాధితురాలు బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సునీల్‌యాదవ్‌ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

బాలుడి అదృశ్యం 1
1/1

బాలుడి అదృశ్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement