
మున్సిపాలిటీ వార్డుల జాబితా విడుదల
చేవెళ్ల: కొత్త మున్సిపాలిటీగా ఏర్పడిన చేవెళ్లలో 18 వార్డుల విభజనతో ముసాయిదా జాబితాను ప్రభుత్వం విడుదల చేసిందని కమిషనర్ పూర్ణచందర్ తెలిపారు. మున్సిపల్ కార్యాలయంలో బుధవారం ఆయన సాక్షితో మాట్లాడుతూ.. చేవెళ్ల కొత్త మున్సిపాలిటీగా చుట్టూ ఉన్న 12 గ్రామాలు చేవెళ్ల, దామరగిద్ద, ఇబ్రహీంపల్లి, రామన్నగూడ, ఊరేళ్ల, దేవునిఎర్రవల్లి, మల్కాపూర్, పలుగుట్ట, మల్లారెడ్డిగూడ, కందవాడ, పామెన, కేసారం గ్రామాల విలీనంతో ఏర్పాటైనట్లు తెలిపారు. వార్డుల విభజనను చట్టం ప్రకారం నియమ నిబంధనలను పాటిస్తూ మున్సిపాలిటీ పరిధిలోని జనాభా, ఓటర్లు, ఇంటి నంబర్లు, గూగల్ మ్యాప్ల ఆధారంగా వార్డుల విభజన చేశామన్నారు. మొత్తం మున్సిపాలిటీలో ఓటర్లు 24,872లు కాగా వీటిని 18 వార్డులకు సమానంగా ఏర్పాటు చేయటంతో నిబంధనల మేరకు ఒక వార్డులో 1,516కి మించకుండా ఉన్నారన్నారు. ఓటర్లు, గ్రామ మ్యాపులను, సరిహద్దులను పరిశీలనలోకి తీసుకొని ఈ విభజన చేశామని పేర్కొన్నారు. వార్డులకు సంబంధించి ఎవరికై నా అభ్యంతరాలు ఉంటే 5 నుంచి 11వ తేదీవరకు మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్కు లిఖిత పూర్వకంగా అందించాలని కోరారు. వార్డుల విభజనకు సంబంధించిన జాబితాలను ఆర్డీఓ, తహసీల్దార్, మున్సిపల్ కార్యాలయంలో నోటీస్ బోర్డులలో పెట్టామని స్పష్టం చేశారు. ప్రజలు గమనించాలని కోరారు. దేవునిఎర్రవల్లి నుంచి 1వ వార్డుతో మొదలై ఊరేళ్ల, మల్కాపూర్, కేసారం, కందవాడ, పలుగుట్ట, మల్లారెడ్డిగూడ, పామెన, దామరగిద్ద, రామన్నగూడ, ఇబ్రహీంపల్లి, చేవెళ్ల గ్రామాల వారీగా వరుసగా ఈ 18 వార్డుల విభజన జరిగిందన్నారు.
జాబితాపై నేటి నుంచి 11వ తేదీవరకు అభ్యంతరాలు, సలహాల స్వీకరణ
మున్సిపల్ కమిషనర్ పూర్ణచందర్