అభివృద్ధే ధ్యేయం | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధే ధ్యేయం

Jun 3 2025 6:59 AM | Updated on Jun 3 2025 6:59 AM

అభివృద్ధే ధ్యేయం

అభివృద్ధే ధ్యేయం

పారదర్శకంగా ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు
ఆకట్టుకున్న చిన్నారుల కళారూపాలు

సాక్షి, రంగారెడ్డిజిల్లా: ‘జిల్లా అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ శక్తి వంచన లేకుండా కృషి చేయాలి. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను సమర్థవంతంగా, పారదర్శకంగా అమలు చేయాలి. ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురాకుండా చూడటంతో పాటు ఉద్యోగులు విధి నిర్వహణలో నీతి, నిజాయితీతో నిక్కచ్చిగా వ్యవహరించాలి’ అని ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన తర్వాత జాతీయ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ కోసం ప్రాణ త్యాగం చేసిన అమరుల కుటుంబ సభ్యులను సన్మానించారు. అనంతరం జిల్లా ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ఆయన మాటల్లోనే..

పథకాలతో ఎంతో చేశాం

ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి ఆర్థిక, సామాజిక, పరిపాలన రంగాల్లో ఆదర్శవంతమైన లక్ష్యాలతో తెలంగాణ రైజింగ్‌–2047 విజన్‌ డాక్యుమెంట్‌ రూపొందించింది. భవిష్యత్తు తెలంగాణకు ఇదో భగవద్గీత. దీనిలో భాగంగానే అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టాం. ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలన్న సంకల్పంతో జిల్లాలో ఇప్పటి వరకు రూ.1,314 కోట్ల జీరో వడ్డీ రుణాలను పంపిణీ చేశాం. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నాం. రూ.500కే వంటగ్యాస్‌ పథకం ద్వారా జిల్లాలో 2,10,276 కుటుంబాలకు లబ్ధి చేకూర్చాం. గృహజ్యోతి పథకం ద్వారా రూ.12.7 కోట్ల సబ్సిడీని మంజూరు చేశాం. 17,440 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశాం. రుణమాఫీ పథకంలో భాగంగా 1,00,268 మంది రైతులకు సంబంధించి రూ.769.54 కోట్లు మాఫీ చేశాం. పెట్టుబడి సాయం కింద 2,19,418 మంది రైతుల ఖాతాల్లో రూ.180.92 కోట్లు జమ చేశాం. ధాన్యం కొనుగోలులో భాగంగా యాసంగిలో 18,112 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించి, రూ.37.21 కోట్లు రైతుల ఖాతాలో జమ చేశాం. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద 10,339 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి వారి ఖాతాల్లో మొదటి విడతగా రూ.6.24 కోట్లు జమ చేశాం. విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తేవాలని భావించి ఇప్పటికే షాద్‌నగర్‌, కల్వకుర్తి నియోజకవర్గాల్లో యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ మోడల్‌ స్కూళ్ల నిర్మాణ పనులు మొదలు పెట్టాం.

ఫ్యూచర్‌సిటీ తలమానికం

హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, సైబరాబాద్‌ తరహా లో మరో అద్భుతనగరానికి శ్రీకారం చుట్టాం. 30 వేల ఎకరాల్లో ఫ్యూచర్‌సిటీ ఏర్పాటు చేస్తున్నాం.ఏఐ సిటీ, ఫార్మాసిటీ, స్పోర్ట్స్‌ సిటీ, లైఫ్‌ సైన్సెస్‌, హెల్త్‌సిటీలను ఏర్పాటు చేస్తున్నాం. అభివృద్ధి పనులు వే గంగా కొనసాగుతున్నాయి. ఇందుకోసం ప్రత్యేకంగా ‘ఫ్యూచర్‌ సిటీ డెవలెప్‌మెంట్‌ అథారిటీ’ ఏర్పా టు చేశాం. అమెరికా, దక్షిణ కొరియా, సింగపూర్‌, దావోస్‌, జపాన్‌ దేశాల్లో పర్యటించి భారీగా పెట్టు బడులు సాధించాం. ఏఐ గ్లోబల్‌ సమ్మిట్‌, బయో ఏసియా సదస్సు, ప్రపంచ సుందరి పోటీలను విజయవంతంగా నిర్వహించి జిల్లాను విశ్వవేదికపై నిలిపాం. వివిధ రుగ్మతలతో బాధపడుతున్న 61,245 మంది పేదలకు రాజీవ్‌ ఆరోగ్య శ్రీ పథకం ద్వారా ఉచిత చికిత్సలు అందించాం. ఇందుకోసం రూ. 151.21 కోట్లు ఖర్చు చేశాం. భూ హక్కుల రికార్డు లను పక్కగా నిర్వహించేందుకు, భూ యజమానులకు భరోసా కల్పించేందుకు, భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు భూ భారతి– 2025 చట్టాన్ని తీసుకొచ్చాం. జిల్లాలోని కొందుర్గు మండలాన్ని పైలెట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేసి, రెవెన్యూ సదస్సులు నిర్వహించాం. రైతుల నుంచి 573 అర్జీలు రాగా, 464 అర్జీలను ఆమోదించాం. మంగళవారం నుంచి అన్ని మండలాల్లో భూభారతి అమల్లోకి వస్తుంది. భూ సమస్యలు లేకుండా పరిష్కరించుకోవాలి. జిల్లా అభివృద్ధి కోసం అధికారులంతా అంకిత భావంతో పని చేయాలి.

అధికారులు అంకితభావంతోపని చేయాలి

నీతి, నిజాయితీ, నిక్కచ్చిగా వ్యవహరించాలి

జిల్లా అభివృద్ధి కోసం శక్తి వంచన లేకుండా కృషి చేయాలి

రాష్ట్ర అవతరణ వేడుకల్లో సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి

వేడుకలను పురస్కరించుకుని జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో చిన్నారులు ప్రదర్శించిన కళారూపాలను ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. శేరిలింగంపల్లి నాగార్జున ఉన్నత పాఠశాల విద్యార్థులు ‘జయజయహే తెలంగాణ’ గీతానికి ప్రదర్శించిన నృత్యరూపకం మనసును కట్టిపడేసింది. కడ్తాల్‌ జెడ్పీహెచ్‌ఎస్‌ విద్యార్థులు దేశ సరిహద్దుల్లో ఆర్మీజవాన్లు చేస్తున్న పోరాటాన్ని తమ నృత్యరూపకంలో కళ్లకు కట్టారు. సరూర్‌నగర్‌ పల్లవి స్కూలు విద్యార్థులు ‘టంగుటుయ్యాల్లో..’అంటూ ప్రదర్శించిన నృత్యరూపకం, తుక్కుగూడ జెడ్పీ స్కూలు విద్యార్థినులు ప్రదర్శించిన బంజారా నృత్యరూపకం, తలకొండపల్లి కేజీబీవీ విద్యార్థులు ప్రదర్శించిన బతుకమ్మ ఆట, ఆమనగల్లు కేజీబీవీ విద్యార్థునులు ప్రదర్శించిన బోనాలు, పోతరాజు విన్యాసాలు, శివసత్తుల పూనకాలు అలరించాయి. కార్యక్రమంలో కలెక్టర్‌ నారాయణరెడ్డి, అదనపు కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌, ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement