నీటితో కాసుల వేట! | - | Sakshi
Sakshi News home page

నీటితో కాసుల వేట!

Jun 3 2025 6:59 AM | Updated on Jun 3 2025 6:59 AM

నీటితో కాసుల వేట!

నీటితో కాసుల వేట!

● గ్రేటర్‌లో యథేచ్ఛగా అక్రమ వ్యాపారం ● అధికారుల కళ్లకు కనిపించని దందా ● ప్రైవేట్‌ స్థలాల్లో బోర్లు వేసి భారీ స్థాయిలో ● మూసీ తీరం నుంచీ పెద్దఎత్తున విక్రయం ● వాల్టా చట్టానికి అడుగడుగునా తూట్లు

సాక్షి, సిటీబ్యూరో: నగరంతో పాటు మూసీ తీరం వెంట అక్రమ నీటి వ్యాపారం జోరుగా సాగుతోంది. ఎలాంటి అనుమతులు లేకుండా భారీగా బోర్లు వేస్తున్న కొందరు ట్యాంకర్ల ద్వారా నీటిని విక్రయిస్తున్నారు. వాటర్‌–ల్యాండ్‌–ట్రీ యాక్ట్‌ను (వాల్టా చట్టం) అడ్డంగా ఉల్లంఘిస్తున్నా...ఒక్క రూపాయి పన్ను చెల్లించకుండా నిత్యం రూ.లక్షల్లో వ్యాపారం చేస్తున్నా సంబంధిత విభాగాలు పట్టనట్లు వ్యవహరిస్తున్నాయి. అక్రమ నీటి వ్యాపారం ఫలితంగా అనేక కాలనీల్లో భూగర్భ జలాలు గణనీ యంగా పడిపోతున్నాయి.

పట్టుమని పది సంస్థలూ లేవు

గృహావసరాల కోసం బోరు వేయాలన్నా కచ్చితంగా స్థానిక తహసీల్దార్‌ నుంచి అనుమతి తీసుకోవాల్సిందే. ఇలా వేసిన బోరు నీటిని గృహ, వ్యక్తిగత అవసరాలకు మాత్రమే వినియోగించాలి. ఒక్క ట్యాంకర్‌ కూడా విక్రయించడానికి ఆస్కారం లేదు. ప్లాంట్‌ ఏర్పాటు చేసి, అనుమతి పొందితే శుద్ధి చేసిన తాగు నీరు విక్రయించవచ్చు. ట్యాంకర్ల ద్వారా నీటిని అమ్మాలంటే కచ్చితంగా భూగర్భ జల శాఖ వద్ద అనుమతి తీసుకోవాలి. ఇలా అను మతి తీసుకున్న వ్యక్తులు, సంస్థలు కనీసం పది కూడా లేకపోవడం గమనార్హం. భూగర్భ జలాలు పరిమితంగా ఉన్న చోట ఇలా బోర్ల ద్వారా విక్రయానికి అనుమతి లభించదు. ప్రస్తుతం నగరంలో మాత్రం ఎలాంటి అనుమతులు లేకుండా వందల అడుగుల బోర్లు వేసి ఆ నీటిని విక్రయిస్తున్న వాళ్లు పదుల సంఖ్యలో ఉన్నారు.

పగటి కంటే రాత్రివేళ ఎక్కువగా..

సాధారణ రోజుల్లో అక్రమ నీటిదందా పగటి వేళలో కంటే రాత్రి వేళల్లోనే ఎక్కువగా జరుగుతుంది. వేసవి వచ్చిందంటే చాలు అక్రమ వ్యాపారులు ట్యాంకర్ల ద్వారా 24 గంటలూ నీటిని తరలిస్తూనే ఉంటున్నారు. భారీ పరిమాణంలో బోర్లు వేసిన అక్రమార్కులు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం కలిగినప్పుడు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన జనరేటర్లు వినియోగించి మరీ నీటిని తోడేస్తున్నారు. కనీసం ఒక్క రూపాయి కూడా పన్ను చెల్లించకుండా రూ.లక్షల్లో వ్యాపారం చేసేస్తున్నారు. ఒక్కో ట్యాంకర్‌ను దాని పరిమాణాన్ని బట్టి రూ.1,000 నుంచి రూ.3,000 వరకు విక్రయిస్తున్నారు.

వినియోగం ఎంత శ్రేయస్కరం...?

ఈ అక్రమ నీటి వ్యాపారం వెనుక ఆరోగ్యానికి చేటు కలిగించే కోణమూ ఉందని తెలుస్తోంది. ట్యాంకర్లలో నీటిని నింపే బోర్లలో కొన్ని మూసీ తీరంలో ఉన్నాయి. ఫలితంగా వీటి నుంచి వచ్చే నీళ్లల్లో మూసీలోని రసాయన వ్యర్థాలకు సంబంధించిన ఆనవాళ్లూ ఉంటున్నాయని తెలుస్తోంది. ఈ నీటిని తాగడానికి వాడకపోయినా ఇతర అవసరాలకు వాడేస్తున్నారు. వేసవి కాలంలో ఉండే నీటి డిమాండ్‌ను బోర్ల నిర్వాహకులు క్యాష్‌ చేసుకుంటున్నారు.

పట్టంచుకోని సంబంధిత విభాగాలు

అక్రమ నీటి దందాలను అడ్డుకోవాల్సిన రెవెన్యూ అధికారులు అటు వైపు కన్నెత్తి కూడా చూడట్లేదనే విమర్శలు ఉన్నాయి. ఇకనైనా స్పందించి నీటి అక్రమ వ్యాపారాన్ని అడ్డుకోవాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పర్యావరణవేత్తలు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement