
పరేషన్!
సోమవారం శ్రీ 2 శ్రీ జూన్ శ్రీ 2025
ఒకేసారి మూడు నెలల సరుకులతో తప్పనితిప్పలు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: మూడు నెలల రేషన్ సరుకులు ఒకేసారి పంపిణీ చేసే విధానంతో తొలిరోజు జిల్లాలోని రేషన్ డీలర్లు, లబ్ధిదారులు ముప్పుతిప్పలు పడ్డారు. మూడు నెలలకు సంబంధించిన సరుకులు ఒకే దఫా ఇవ్వడానికి అవకాశం లేకుండా పోయింది. ఒక్కో కార్డుదారుడికి బియ్యం పంపిణీలో ఆరు దఫాలు తూకం వేయాల్సి వస్తోంది. ఆరుసార్లు థంబ్ వేయాల్సి వస్తోంది. ఈ సమయంలో సర్వర్ డౌన్, ఇతర సమస్యలు చిరాకు తెప్పిస్తున్నాయని పలువురు వాపోయారు. బియ్యం పంపిణీ పూర్తయిన తర్వాత కూడా స్టాక్లో రేషన్ కట్ కాకపోవడంతో డీలర్లు తలలు పట్టుకుంటున్నారు. ఒక్కో కార్డుకు బియ్యం ఇవ్వడానికి కనీసం 20 నిమిషాల నుంచి అరగంట పడుతోంది. కొన్ని రేషన్ దుకాణాల్లో సర్వర్ డౌన్ కావడంతో లబ్ధిదారులు బారులు తీరారు. ఎండలో ఎదురుచూసి, ఓపిక నశించి వెనుదిరిగారు. మరికొన్ని చోట్ల డీలర్లకు సాఫ్ట్వేర్పై అవగాహన లేకపోవడం, ఇతర సమస్యలతో రేషన్ దుకాణాలను తెరవలేదు. పలు దుకాణాల్లో సర్వర్ డౌన్ కావడంతో మూడు గంటలకు కేవలం ఒకరిద్దరికి మాత్రమే బియ్యం అందించారు. దీంతో దుకాణాల ఎదుట భారీగా బారులు తీరిన జనం డీలర్లతో వాగ్వాదానికి దిగారు.
కొత్త సాఫ్ట్వేర్తో అవస్థలు
రేషన్ సరుకుల పంపిణీలో కొత్త సాఫ్ట్ వేర్ కొత్త కష్టాలు తెచ్చిపెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త సాఫ్ట్ట్వేర్లో ఒక్కో వ్యక్తికి అందించాల్సిన ఆరు కిలోల బియ్యాన్ని విభజించి చూపిస్తోంది. కేంద్రం ఇచ్చే ఐదు కిలోల బియ్యం ఒక దఫా తూకం వేయగా, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఒక్క కేజీ బియ్యం కోసం మరో దఫా తూకం వేయాల్సి వస్తోంది. ఒక నెలకు ఒక కార్డుదారుకు రెండు దఫాలు తూకం వేయాల్సి వస్తోంది. ఇలా మూడు నెలలకు ఆరు దఫాలు అన్నమాట. దీంతో చాలా సమయం వృథా అవుతోందని డీలర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి వచ్చే స్టాక్ గతంలో ఆటోమేటిక్గా డీలర్ డివైజ్లో కనిపించేది. ఇప్పుడు అప్డేట్ కావడం లేదని పేర్కొంటున్నారు. ఇలాంటి పంపిణీ వ్యవస్థను వ్యతిరేకించాలని డీలర్లు సంఘం పిలుపునిచ్చింది. దీనిపై పౌరసరఫరాల శాఖ కమిషనర్కు వినతి పత్రం ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. కొత్త సాఫ్ట్వేర్తో చాలా సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని, పాత పద్ధతిలోనే పంపిణీ చేయాలని డీలర్లు కోరుతున్నారు.
తెరిచారు.. మూశారు
కందుకూరు: మండలంలోని 46 రేషన్ దుకాణాల నుంచి ఆదివారం లబ్ధిదారులకు బియ్యం ఇవ్వాల్సి ఉండగా సాఫ్ట్వేర్ సమస్యతో సరఫరాను నిలిపివేశారు. ఒక్కో లబ్ధిదారు ఆరుసార్లు వేలిముద్రల స్కాన్ చేయాల్సి రావడంతో పాటు తీసుకుంటున్న రేషన్ బియ్యం అసలు స్టాక్ నుంచి తగ్గడంలేదు. దీంతో పాటు ఇతర సాఫ్ట్వేర్ సమస్యలు నెలకొన్నట్లు రేషన్ డీలర్లు వాపోతున్నారు. మరోవైపు వేలిముద్ర స్కాన్తో పాటు తప్పనిసరిగా మొబైల్ నంబర్ నమోదు చేయాలి. చాలామందికి మొబైల్ ఉండకపోవడం, ఒక్కో లబ్ధిదారుకు దాదాపు అరగంట సమయం పడుతుండటంతో ఇటు డీలర్లు, అటు లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో తొలొరోజు కొన్ని గ్రామాల్లో రేషన్ షాపులు తెరిచి ఒకరిద్దరికి బియ్యం ఇవ్వగా అవి అసలు స్టాక్ నుంచి తగ్గకపోవడంతో అధికారుల సూచనల మేరకు నిలిపివేశారు.
సగం దుకాణాలకే కోటా
షాబాద్: మండలం మొత్తం 37 రేషన్ షాపులు ఉండగా ఆదివారం 15 దుకాణాల్లో మాత్రమే పంపిణీ చేశారు. రుద్రారం గ్రామంలో రేషన్ తీసుకునేందుకు లబ్ధిదారులు బారులు తీరారు. మండలంలో ఏడు షాపులకు పూర్తి బియ్యం సరఫరా కాగా, మిగతా దుకాణాలకు సగం కోటా సరఫరా చేసినట్లు డీలర్లు చెప్పారు. రేషన్ షాపుల వద్ద సర్వర్ సమస్య, బయో మెట్రిక్ సమస్యతో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఒకరికి రేషన్ తీసుకునేందుకు 15 నిమిషాల వరకు సమయం పట్టింది.
న్యూస్రీల్
ఈ నెల 30 వరకు అవకాశం
వేర్వేరుగా చూపిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లాగిన్
ఒక్కో కార్డుదారుడికి రెండు దఫాలుగా తూకం
జిల్లాలో తెరుచుకోని కొన్ని దుకాణాలు
తొలిరోజు పలు ప్రాంతాల్లో లబ్ధిదారుల పాట్లు
రేషన్ సరుకుల పంపిణీ ఈ నెల 30 వరకు ఉంటుంది. గతంలో 15వ తేదీ తరువాత పంపిణీ నిలిచిపోయేది. తాజాగా మూడు నెలల సరుకులు ఒకేదఫా ఇవ్వాలన్న నిర్ణయంతో క్షేత్ర స్థాయిలో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నందున ప్రభుత్వం ఈ నెల 30 వరకు లబ్ధిదారులకు రేషన్ దుకాణాలు అందుబాటులో ఉంచాలని ఆదేశించింది. ఫలితంగా కార్డుదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

పరేషన్!

పరేషన్!

పరేషన్!

పరేషన్!