
నకిలీ పత్తి విత్తనాల పట్టివేత
షాద్నగర్: గుట్టు చప్పుడు కాకుండా నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్న, కొనుగోలు చేసిన వారిని పోలీసులు పట్టుకొన్న సంఘటన షాద్నగర్లో ఆదివారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్టీఆర్ జిల్లా చంద్రలపాడు గ్రామానికి చెందిన జంపాని నాగేశ్వర్రావు కొంత కాలంగా వికారాబాద్ జిల్లా ద్యాచర్ల గ్రామంలో కొంత పొలాన్ని రైతుల వద్ద కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. పల్నాడు జిల్లా అమరావతి మండలానికి చెందిన వీర వసంతరావు ద్వారా నకిలీ పత్తి విత్తనాలు తెప్పిస్తున్నాడు. మేలైన విత్తనాలు అని నమ్మించి చుట్టు పక్కల ఉండే రైతులకు విక్రయిస్తున్నాడు. ఈ క్రమంలో ఇద్దరూ కలిసి షాద్నగర్లో విక్రయించేందుకు ప్రయత్నించారు. పట్టణ శివారులోని బక్కర్మన్ గార్డెన్ ఎదుట ఉన్న ఖాళీ స్థలంలో నిషేధిత పత్తి విత్తనాలను కారులో తీసుకొచ్చి ముగ్గురు రైతులకు విక్రయించేందుకు ప్రయత్నించారు. పక్కా సమాచారం అందుకున్న షాద్నగర్ వ్యవసాయ అధికారులు, ఎస్ఓటీ, షాద్నగర్ పోలీసులు నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న, కొనుగోలు చేస్తున్న వారిని పట్టుకొన్నారు. వారి నుంచి రూ.7.5లక్షల విలువ చేసే 300కిలోల నకిలీ విత్తనాలను, కారును స్వాధీనం చేసుకున్నారు. నాగేశ్వర్రావు, వీర వసంతరావుతోపాటు వికారాబాద్ జిల్లా ఐయాన్పూర్ గ్రామానికి చెందిన రైతు గంగారపు పాండు, దాచారం గ్రామానికి చెందిన టెక్నో సీడ్స్ కంపెనీ సేల్స్ ఎగ్జిక్యూటివ్ చాకలి రాములు, ఐనాపూర్కు చెందిన రైతు నెమలి రవిని అదుపులోకి తీసుకున్నారు. దాడుల్లో షాద్నగర్ ఇన్చార్జి ఏడీఏ నిషాంత్కుమార్, ఏఈఓ తేజ్కుమార్, ఎస్ఐ శరత్కుమార్, మేడ్చల్ ఎస్ఓటీ ఎస్ఐ ధనుంజయ తదితరులు పాల్గొన్నారు.
రూ.7.50 లక్షల విలువైన 300 కిలోల నిషేధిత విత్తనాలు స్వాధీనం
ఐదుగురిని అరెస్టు చేసిన పోలీసులు