
పరిహారం.. పరిహాసం
● కేసు పెండింగ్లో ఉన్నా పట్టించుకోని అధికారులు ● అసలు పట్టాదారుకు కాకుండా మరొకరికి రూ.1.25కోట్లు, ఐదు ప్లాట్ల సర్టిఫికెట్ల అందజేత ● గ్రామస్తులతో కలిసి ఆర్డీఓని ఆశ్రయించిన బాధిత రైతు
కందుకూరు: కోర్టులో కేసు.. అధికారుల వద్ద పూర్తి సమాచారం ఉన్నప్పటికీ ఫార్మాసిటీ భూ పరిహారం మాత్రం అసలు పట్టాదారుకు కాకుండా మరొకరికి అందింది. రూ.1.25 కోట్లతో పాటు అదనంగా ఐదు ప్లాట్ల సర్టిఫికెట్లు అందించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితులు తెలిపిన ప్రకారం. మండల పరిధిలోని ముచ్చర్ల రెవెన్యూ సర్వే నంబర్ 288/1క్యూలో ముచ్చర్ల అనుబంధ గ్రామం ఊట్లపల్లికి చెందిన బొర్ర బుచ్చయ్యకు వారసత్వంగా వచ్చిన ఐదెకరాల పట్టా భూమి ఉంది. అదే గ్రామానికి చెందిన కుందేళ్ల రాములు రెవెన్యూ అధికారులతో కుమ్మకై ్క 2006–07లో తప్పుడు ప్రొసీడింగ్ నంబర్ 1621/1992తో తన పేరిట నమోదు చేయించుకున్నాడు. రాములు మృతి చెందడంతో 2011లో ఆయన భార్య జంగమ్మ తన పేరిట విరాసత్ చేయించుకుంది. ఆలస్యంగా గుర్తించిన బుచ్చయ్య రెవెన్యూ అధికారులకు మొరపెట్టుకున్నాడు. ఫలితం లేకపోవడంతో ఇబ్రహీంపట్నం కోర్టును ఆశ్రయించాడు. అనంతరం కేసు పరిశీలించిన జేసీ 2015లో రికార్డులు అసలు పట్టాదారుకు అనుకూలంగా మార్చాలంటూ ఆదేశాలిచ్చారు. అయినప్పటికీ మార్చలేదు. ఈ క్రమంలో 2016లో ఫార్మాసిటీ కోసం ఆ సర్వే నంబర్లోని భూములను ప్రభుత్వం సేకరించే పనులు ప్రారంభించింది. దీంతో పరిహారం తనకే చెల్లించాలని కోరుతూ అసలు పట్టాదారు బుచ్చయ్య హైకోర్టును ఆశ్రయించాడు. ఈ భూవివాదం పెండింగ్లో ఉండగానే 2023 అక్టోబర్ 19న కుందేళ్ల జంగమ్మకు ఎకరాకు రూ.25 లక్షల చొప్పున రూ.1.25 కోట్లు పరిహారం చెల్లించి ఎకరాకు 121 గజాల చొప్పున ఐదు ప్లాట్లు కేటాయిస్తూ సర్టిఫికెట్లు జారీ చేశారు. విషయాన్ని గుర్తించిన అసలు పట్టాదారు గ్రామస్తులతో కలిసి బుధవారం ఆర్డీఓ జగదీశ్వర్రెడ్డిని కలిసి తన గోడు వెల్లబోసుకున్నాడు. కోర్టులో కేసుండగా పరిహారం ఎలా ఇస్తారంటూ ప్రశ్నించాడు. ఇందుకు స్పందించిన ఆర్డీఓ పూర్తి సమాచారం కలెక్టర్కు నివేదిస్తానని.. ఆయన ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు.
బాధితులు ఎందరో!
కాగా ఫార్మాసిటీ పరిహారం చాలా మంది రైతులకు ఇంకా పెండింగ్లోనే ఉంది. మరోపక్క అధికారులు భూములకు ఫెన్సింగ్ వేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. తమకు న్యాయం చేసిన తర్వాతే ఫెన్సింగ్ పనులు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. మరోపక్క గతంలో పరిహారం ఇచ్చే సమయంలో బోర్లకు, షెడ్లకు, చెట్లకు ఇస్తామని చెప్పిన అధికారు లు పరిహారం చెల్లించే సమయంలో ఆ ఊసేలేదు. దీంతో రైతులు అధికంగా నష్టపోవాల్సి వచ్చింది.