
రోడ్డు ప్రమాదంలో కొడుకు.. కరెంట్ షాక్తో తండ్రి
● నెల రోజుల వ్యవధిలో తండ్రీకొడుకుల దుర్మరణం
● పుట్టెడు దుఃఖంలో బాధిత కుటుంబం
కందుకూరు: కొడుకు మరణాన్ని జీర్ణించుకోలేక మనోవేదనకు గురవుతున్న ఓ తల్లికి భర్త మృతి మరింత శోకాన్ని మిగిల్చింది. నెల రోజుల వ్యవధిలో కుమారుడు, భర్తను కోల్పోయి గుండెలు బాదుకుంటోంది. ఇందుకు సంబంధించి స్థానికు లు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. రంగారెడ్డి జిల్లా మాదాపూర్కు చెందిన మంద రాములు(49), సుజాత దంపతులు వ్యవసాయంతో పాటు పశువులను పోషిస్తూ జీవనం సాగిస్తున్నాడు. వీరికి ఇద్దరు కొడుకులు, కూతురు సంతానం. పెద్దకొడుకు, కూతురు వివాహం చేశారు. లారీ డ్రైవర్గా పనిచేసే చిన్న కొడుకు భానుప్రకాశ్ నెల రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. కుటుంబమంతా ఇదే బాధలో ఉంది. అయితే సోమవారం ఉద యం రాములు పశువులకు మేత కోసేందుకు పొలం వద్దకు వెళ్లాడు. తన పక్క పొలంలోని గట్లపై గడ్డి కోస్తుండగా.. కొడవలి సర్వీస్ వైర్ను తగలడంతో షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మధ్యాహ్నం భోజనం తీసు కుని వెళ్లిన సుజాత భర్తను చూసి గుండెలు బాదుకుంది. పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ జంగయ్య తెలిపారు.
ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే చర్యలు
మొయినాబాద్రూరల్: ప్రభుత్వ భూములను కబ్జా చేయాలని చూస్తే కఠిన చర్యలు తప్పవని మొయినాబాద్ తహసీల్దార్ గౌతమ్కుమార్ హెచ్చరించారు. కలెక్టర్ కార్యాలయంలో తోల్కట్ట గ్రామానికి చెందిన గ్రామస్తులు ప్రభుత్వ భూములు కాపాడాలని ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. దీంతో మంగళవారం అధికారులు స్పందించి తోల్కట్ట రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్ 107లో రెండు ఎకరాల్లో వేస్తున్న అక్రమ ఫెన్సింగ్ను అడ్డుకున్నారు. తహసీల్దార్ ఆదేశాల మేరకు అదనపు ఆర్ఐ రాజేష్, రెవెన్యూ సిబ్బంది జేసీబీ సహాయంతో ప్రభుత్వ భూమిలో నిర్మిస్తున్న ఫెన్సింగ్ను తొలగించారు. అదే స్థలంలో ప్రభుత్వ సూచిక బోర్డు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ.. ప్రభుత్వ భూముల్లో కబ్జాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో కొడుకు.. కరెంట్ షాక్తో తండ్రి