
హాస్టల్ గదిలో ఉరేసుకుని..
ఇబ్రహీంపట్నం: ఓ బీటెక్ విద్యార్థి హాస్టల్ గదిలో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని గురునానక్ కాలేజీలో శనివారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం కురనవెళ్లికి చెందిన అలూరి భావన(22) ఇబ్రహీంపట్నం సమీపంలోని గురునానక్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతూ ఇదే హాస్టల్లో ఉంటోంది. ఆమె గదిలో ఉండే మరో ఇద్దరు విద్యార్థినులు స్వగ్రామాలకు వెళ్లడంతో ప్రస్తుతం భావన ఒక్కతే ఉంది. ఏమైందో తెలియదు కానీ శనివారం తన గదిలోని ఫ్యాన్కు ఉరేసుకుంది. కొద్ది సేపటికి ఇది గమనించిన మిగిలిన విద్యార్థులు యాజమాన్యంతో పాటు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతురాలి తండ్రి శశిరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భావన మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం స్వస్థలానికి తరలించే అవకాశం ఉందని తెలిసింది.
కాలేజీ వద్ద ఉద్రిక్తత
విద్యార్థిని ఆత్మహత్య విషయం తెలుసుకున్న మిత్రులు, విద్యార్థి సంఘాల ప్రతినిధులు కాలేజీ ఎదుట ఆందోళన చేపట్టారు. పలువురు ఎస్ఎఫ్ఐ నేతలు గేట్లు దూకి లోనికి వెళ్లడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏసీపీ రాజు, సీఐ జగదీశ్లు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు.
ఆత్మహత్యలకు అడ్డాగా..
గురునానక్ కళాశాల హాస్టల్ విద్యార్థుల ఆత్మహత్యలకు నిలయంగా మారిందని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ప్రణయ్, కార్యదర్శి శంకర్ మండిపడ్డారు. భావన బలవన్మరణానికి పాల్పడిందనే విషయాన్ని బయటకు చెప్పకుండా, ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారని మండిపడ్డారు. కాలేజీలో గంజాయి, డ్రగ్స్ విరివిగా దొరుకుతున్నాయని ఆరోపించారు. విద్యార్థుల భవిష్యత్తుతో పాటు ప్రాణాలతో చెలగాటమాడుతున్న యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
బీటెక్ విద్యార్థి ఆత్మహత్య
ఇబ్రహీంపట్నంలోని గురునానక్ఇంజనీరింగ్ కళాశాలలో ఘటన
విద్యార్థి సంఘాల ఆందోళన
మృతురాలిది ఖమ్మం జిల్లా

హాస్టల్ గదిలో ఉరేసుకుని..