
కారులో మంటలు.. ఇద్దరు సజీవ దహనం
అబ్దుల్లాపూర్మెట్: ఔటర్ రింగ్ రోడ్డుపై శనివారం తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రహదారిపై నిలిపి ఉన్న బొలేరో వాహనాన్ని వెనుక నుంచి వచ్చిన కారు బలంగా ఢీకొట్టడంతో కారులో మంటలు చెలరేగాయి. అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులు మంటల్లో చిక్కుకుని మృత్యువాత పడ్డారు. అబ్దుల్లాపూర్మెట్ పోలీస్ స్టేషన్ పరిఽధిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. నగరంలోని తాడ్బన్ బహదూర్పూర ప్రాంతం హెచ్బీ కాలనీలో నివాసముండే రితేష్కుమార్ కుమారుడు దీపేష్కుమార్ (23) శుక్రవారం రాత్రి 11గంటలకు స్నేహితులను కలిసేందుకు వెళ్తున్నానని చెప్పి తన కారులో ఇంటి నుంచి బయలుదేరాడు. ఈ క్రమంలో తన స్నేహితులైన హైదరాబాద్ వీటీసీ కాలనీకి చెందిన సంచయ్ మల్పనీ (22), మూసాపేట్కు చెందిన ప్రియాన్ష్ మిఠల్ (23) కలిసి శంషాబాద్ వైపు వెళ్తున్నారు. పెద్దఅంబర్పేట శివారు గండిచెరువు వంతెన సమీపంలోకి రాగానే (రాత్రి 2 గంటలకు) ఎలాంటి సూచిక బోర్డులు ఏర్పాట చేయకుండా రోడ్డుపై నిలిపి ఉంచిన బొలేరోను ఢీకొట్టారు. వీరి కారు బొలేరో ముందు భాగంలో ఇరుక్కుని, ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. యువకులుతేరుకునే లోపే ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. ఈ ఘటనలో దీపేష్ కుమార్, సంచయ్ మల్పనీ కారులోనే సజీవ దహనం కాగా, కొన ఊపిరితో ఉన్న ప్రియాన్స్మిఠల్ను అతికష్టంగా బయటకు తీసిన స్థానికులు ఎల్బీనగర్లోని కామినేమి ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతను మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఉస్మానియా మార్చురీకి తరలించారు.
ఆస్పత్రికి తరలిస్తుండగా మరొకరి మృతి
ఓఆర్ఆర్పై ఆగిఉన్న బొలేరోనుఢీకొట్టడంతో ప్రమాదం