
అదిగో.. అందాల లోకం!
అట్టహాసంగా మిస్ వరల్డ్ పోటీలు ప్రారంభం
దివిలో తారకలు భువిపైకి దిగివచ్చాయా? సౌందర్య లోకం నేలపైకి నడిచి వచ్చిందా? అనే తీరుగా ప్రపంచ సుందరీమణులు తళుక్కున మెరిశారు. తమ అందచందాలతో, చందన మందగమనంతో మురిశారు. భాగ్య నగరం ఖ్యాతి మరోసారి విశ్వవ్యాప్తమైంది. శనివారం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో రాష్ట్ర గీతం ‘జయ జయహే తెలంగాణ’ ఆలాపనతో 72వ మిస్ వరల్డ్ పోటీలు వివిధ దేశాలకు చెందిన జాతీయ పతాకాలు, విభిన్న సంస్కృతుల సమ్మేళనంతో అట్టహాసంగా ఆవిష్కృతమయ్యాయి. ఈ సందర్భంగా సంస్కృతి, సౌందర్యం రెండింటి మేళవింపుగా ప్రపంచ సుందరి– 2025 ప్రారంభ ఉత్సవాలను తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది. ఇందులో భాగంగా జానపద, గిరిజన, శాసీ్త్రయ కళలు, హైదరాబాదీ దక్కన్ కళారూపాలను ఈ ఉత్సవాలలో సమ్మిళితం చేసి ప్రపంచ వ్యాప్తంగా తెలంగాణ ఖ్యాతిని, సాంస్కృతిక వైభవాన్ని చాటి చెప్పారు. ముఖ్యంగా కాకతీయుల కాలం నుంచి తెలంగాణ శాసీ్త్రయ నృత్య రీతిగా ఖ్యాతి గడించిన పేరిణి నాట్య ప్రదర్శన అత్యంత వైభవంగా ప్రదర్శించారు. ప్రారంభ వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మిస్ వరల్డ్ సీఈఓ జూలియా మోర్లే, మాజీ మిస్ వరల్డ్ క్రిస్టినా పిస్కోవా, జయేశ్ రంజన్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, నగర మేయర్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. దాదాపు 111 దేశాలకు పైగా సుందరీమణులు వేదికపై అలరించారు. అధునాతన ఫ్యాషన్ వస్త్రాలంకరణతో పాటు కొందరు తమ దేశ సంస్కృతులను ప్రతిబింబించేలా మిస్ వరల్డ్ వేదికకు వన్నె తెచ్చారు.
– సాక్షి, సిటీబ్యూరో