
అన్నదాతకు అకాల కష్టం
భారీవర్షానికి తడిసిన ధాన్యం
టార్పాలిన్లు లేకపోవడంతో కొట్టుకుపోయిన వైనం
ఆమనగల్లు: పట్టణంలో శనివారం మధ్యాహ్నం కురిసిన భారీ వర్షం అన్నదాతలను ఆగమాగం చే సింది. ముప్పావుగంట పాటు దంచికొట్టిన వానతో కాలనీలు జలమయమయ్యాయి. ప్రధాన రహదారిపై నీరు నిలవడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. ఈదురు గాలులకు చెట్లు నేలకూలాయి. స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతులు ఆరబోసిన వడ్లు కొట్టుకుపోయాయి. టార్పాలిన్లు అందుబాటులో లేక పలువురి ధాన్యం కొట్టుకుపోయింది.
తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు మార్కెట్ యార్డు ఎదుట హైదరాబాద్– శ్రీశైలం రహదారిపై ఆందోళన చేపట్టారు. బీఆర్ఎస్ నాయకులు వీరికి మద్దతు తెలిపారు. కర్షకుల ఆందోళనతో ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులు వచ్చి నచ్చజెప్పడంతో రైతుల ఆందోళన విరమించారు. బీఆర్ఎస్ మున్సిపల్ అధ్యక్షుడు పత్యానాయక్ మాట్లాడుతూ తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని కోరారు.