
ఫెన్సింగ్
యాచారంలో ఫార్మాసిటీకిసేకరించిన భూమిలో సర్వే పూర్తి
సమష్టి భాగస్వామ్యంతో సర్వే
గ్రీన్ ఫార్మాసిటీ ఠాణా పరిధిలోని నక్కర్తమేడిపల్లి, నానక్నగర్, తాడిపర్తి, కుర్మిద్ద గ్రామాల్లో భూముల సర్వే, ఫెన్సింగ్ పనులు సమష్టి భాగస్వామ్యంతోనే సాధ్యమవుతుంది. రైతులు సహకారంతో సర్వే పూర్తయింది. ఉన్నతాధికారుల ఆదేశాల పాటిస్తూ పనులు కొనసాగిస్తున్నాం. – లిక్కి కష్ణంరాజు, సీఐ, హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ పీఎస్
యాచారం: గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఫార్మాసిటీకి సేకరించిన భూముల సర్వే, ఫెన్సింగ్ ఏర్పాటు పనుల్లో అధికార యంత్రాంగం పట్టువీడడం లేదు. ఈ నెల 3న మండల పరిధిలోని నక్కర్తమేడిపల్లి నుంచి ఈ పనులు ప్రారంభించారు. యాచారం–కడ్తాల్ సరిహద్దులోని నక్కర్తమేడిపల్లి, నానక్నగర్, కుర్మిద్ద, పల్లెచెల్కతండా, తాడిపర్తి గ్రామాల్లో సర్వే పూర్తయింది. 150 మందికి పైగా రెవెన్యూ, టీజీఐఐసీ, సర్వే, పోలీస్ సిబ్బంది ఈ పనుల్లో తలమునకలవుతున్నారు.
14 వేల ఎకరాలకు 90 కిలోమీటర్ల ఫెన్సింగ్
యాచారం, కందుకూరు మండలాల్లో 19,333 ఎకరాల అసైన్డ్, పట్టా భూములను సేకరించేందుకు అప్పటి బీఆర్ఎస్ సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు రెండు మండలాల పరిధిలో పది గ్రామాల్లో 14వేల ఎకరాలకు పైగా భూమిని సేకరించారు. ఈ సేకరించిన భూముల చుట్టూ బౌండరీ ఏర్పాటుకు 90 కిలోమీటర్ల మేర ఉంటుంది. ప్రస్తుత ప్రభుత్వం ఈ భూమిలో ఫోర్త్ సిటీ నిర్మించేందుకు నిర్ణయించిన విషయం విదితమే. ఫ్యూచర్ సిటీలో భాగస్వామ్యం అయ్యే ప్రముఖ సంస్థలకు భూములు అప్పగిస్తే భవిష్యత్లో రైతుల నుంచి చిక్కులు రావద్దనే ఉద్దేశ్యంతో రేవంత్రెడ్డి సర్కార్ భూముల సర్వే చేసి ఫెన్సింగ్ పనులకు పూనుకుంది. సర్వే, ఫెన్సింగ్కు కావాల్సిన ఏర్పాట్లను టీజీఐఐసీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇక కందుకూరు మండలంలో..
నక్కర్తమేడిపల్లి, నానక్నగర్, తాడిపర్తి, కుర్మిద్ద గ్రామాల్లో ఫార్మాసిటీకి సేకరించిన భూముల బౌండరీ 45 కిలోమీటర్లు కాగా నేటికీ 15 కిలోమీటర్లకు పైగా ఫెన్సింగ్ పనులు పూర్తి చేశారు. పది రోజుల్లో యాచారం మండల పరిధిలోని నాలుగు గ్రామాల్లో ఫెన్సింగ్ పనులు పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. త్వరలలో కందుకూరు మండల పరిధిలోని ముచ్చర్ల, సాయిరెడ్డిగూడ, మీరాఖాన్పేట తదితర గ్రామాల్లోని భూముల సర్వే పనులు మొదలు పెట్టేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
చురుగ్గా కొనసాగుతున్న కంచె నిర్మాణ పనులు
మరో రెండు రోజుల్లో కందుకూరు పరిధిలో షురూ