
చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి
● ఏఎస్పీ శేషాద్రినిరెడ్డి
వేములవాడరూరల్: మాదకద్రవ్యాల నిర్మూలనలో విద్యార్థులు భాగస్వామ్యం కావాలని వేములవాడ ఏఎస్పీ శేషాద్రినిరెడ్డి అన్నారు. నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం వేములవాడలోని బీసీ రెసిడెన్షియల్ పాఠశాల ఆవరణలో విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు. ఆరోగ్యకరమైన జీవితం కోసం ప్రతి ఒక్కరూ ప్రకృతిని ప్రేమిస్తూ చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు. యువత గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని కోరారు. విద్యార్థుల కదలికలపై అధ్యాపకులు నిఘా ఉంచాలన్నారు. అలాగే మండలంలోని చెక్కపల్లి ప్రభుత్వ పాఠశాలలో డ్రగ్స్కు వ్యతిరేకంగా వేములవాడ రూరల్ ఎస్సై అంజయ్య విద్యార్థులకు క్లాపింగ్, వ్యాయామం చేయించారు. ఎంఈవో లోకిని కిషన్ తదితరులు పాల్గొన్నారు.