
గోశాల నిర్మించాలని వినతి
వేములవాడరూరల్: వేములవాడ రూరల్ మండలంలోని మర్రిపల్లి గ్రామశివారులో రాజన్న కోడెలకు గోశాలను నిర్మించాలని విప్ ఆది శ్రీనివాస్ మంగళవారం సీఎం రేవంత్రెడ్డికి విజ్ఞప్తి చేశారు. మర్రిపల్లిలో 40 ఎకరాల స్థలంలో ఆధునిక గోశాల నిర్మించాలని కోరారు. ఇందుకు సీఎం సానుకూలంగా స్పందించినట్లు విప్ తెలిపారు.
సీఐటీయూ సమ్మె నోటీస్
సిరిసిల్లటౌన్: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలను ఉపసంహరించుకోవాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కోడం రమణ కోరారు. కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్ల రద్దు, ఇతర డిమాండ్లతో దేశం, రాష్ట్రంలోని అన్ని కార్మిక సంఘాల జాయింట్ ప్లాట్ ఫామ్ ఆధ్వర్యంలో జూలై 9న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఈమేరకు మంగళవారం జిల్లా అధికారులకు సమ్మె నోటీసు అందజేశారు. పారిశ్రామిక వివాదాల చట్టాన్ని అనుసరించి సమ్మె నోటీసు ఇవ్వడం జరిగిందన్నారు. ఆయన వెంట అధ్యక్షుడు ఎగమంటి ఎల్లారెడ్డి తదితరులు ఉన్నారు.
26 నుంచి పాలిసెట్ ధ్రువపత్రాల పరిశీలన
వేములవాడరూరల్: ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు టీజీ పాలిసెట్–2025లో ర్యాంకులు సాధించిన విద్యార్థుల ధృవపత్రాలను ఈ నెల 26 నుంచి పరిశీలించనున్నట్లు అగ్రహారం పాలిటెక్నికల్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రభాకరచారి తెలిపారు. పాలిసెట్ ర్యాంక్కార్డు, ఆధార్, ఎస్సెస్సీ మెమో, 4 నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్స్, ఆదాయం, కులం, ఈడబ్ల్యూఎస్, టీసీ ఒరిజినల్, జిరాక్స్లు రెండు సెట్లు ఉండాలని పేర్కొన్నారు.

గోశాల నిర్మించాలని వినతి