
హోటళ్లపై ఫారెస్ట్ అధికారుల దాడి
వేములవాడరూరల్: హోటళ్లలో వన్యప్రాణుల మాంసం విక్రయిస్తున్నారని సోమవారం ‘సాక్షి’ దినపత్రికలో ప్రచురితమైంది. దీనికి స్పందించిన ఫారెస్ట్ అధికారులు వేములవాడ మండలంలోని నాంపల్లిలోని హోటళ్లలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎవరైనా వన్యప్రాణులను విక్రయిస్తే సమాచారం ఇవ్వాలని, హోటళ్లలో మాంసం విక్రయించొద్దని వేములవాడ సెక్షన్ ఆఫీసర్ అబ్జల్ హుస్సేన్ హెచ్చరించారు. ఆయన వెంట సాయబుస్సేన్, ప్రసాద్, స్వామి, రవి, సిబ్బంది ఉన్నారు.
అనుమతి లేని షెడ్డు తొలగింపు
వేములవాడరూరల్: వేములవాడ మండలంలోని మర్రిపల్లి శివారులో అనుమతులు లేకుండా రైస్మిల్లు యజమానులు షెడ్డు నిర్మాణం చేపట్టారు. ఈ విషయాన్ని ‘సాక్షి’లో అనుమతి లేని నిర్మాణాలు... పట్టించుకోని అధికారులు శీర్షికన సోమవారం కథనం ప్రచురితమైంది. సాక్షి కథనానికి స్పందించిన అధికారులు వెంటనే షెడ్డు కూల్చివేయాలని మర్రిపల్లి కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు. గ్రామ కార్యదర్శి జేసీబీతో షెడ్డును కూల్చివేసినట్లు తెలి పారు. కూల్చివేత ఖర్చులు కూడా యజమానుల నుంచి వసూలు చేస్తామని తెలిపారు.
విద్యార్థి అదృశ్యం
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన విద్యార్థి మహమ్మద్ తాజొద్దీన్(8) సోమవారం పాఠశాలకు వెళ్లి అదృశ్యమయ్యాడు. మండల కేంద్రంలోని కిషన్దాస్పేటలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు వెళ్లిన విద్యార్థి సాయంత్రం ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విద్యార్థి అదృశ్యమవడం స్థానికంగా కలకలం రేపింది. కుటుంబ సభ్యులు ఎంత గాలించినా ఆచూకీ లభించలేదు. పాఠశాల నుంచి ఇంటికి వస్తున్న తాజొద్దీన్ను ఎవరైనా కిడ్నాప్ చేశారా.. అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి, విద్యార్థి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. తాజొద్దీన్ ఆచూకీ తెలిస్తే డయల్ 100 లేదా 87126 56374 లేదా 90004 57637లో సమాచారం అందించాలని ఎస్సై రమాకాంత్ కోరారు.
ఏషియన్ షాట్ఫుట్ పోటీలకు అడవిబిడ్డ
సిరిసిల్లటౌన్: ఏషియన్ పారా టైక్వాండో చాంపియన్ పోటీలకు జిల్లాకు చెందిన అడవిబిడ్డ భూక్య సక్కుబాయి ఎంపికయ్యారు. పంజాబ్లో ఈనెల 21, 22 తేదీల్లో నిర్వహించిన ఓపెన్ సెలక్షన్స్ ట్రయల్ ఫర్ ఏషియన్ పారా టైక్వాండో చాంపియన్షిప్ జీ–4 పోటీలు జరిగాయి. వీర్నపల్లి మండలం బంగిరెడ్డిపల్లితండాకు చెందిన సక్కుబాయి బ్రౌంజ్ మెడల్ సాఽధించారు. జూలై 28 నుంచి 30 వరకు మలేషియాలో జరిగే ఏషియన్ పోటీల్లో పాల్గొననుంది.
వ్యవసాయరంగ అభివృద్ధికి బాటలు
● డీఆర్డీవోను కలిసిన సమగ్ర రైతు సహకార సంస్థ ప్రతినిధులు
సిరిసిల్ల: జిల్లాలో వ్యవసాయరంగ అభివృద్ధికి బాటలు వేయాలని డీఆర్డీవో శేషాద్రి కోరారు. కలెక్టరేట్లో సోమవారం సమగ్ర రైతు సహకార సంస్థ ప్రతినిధులు డీఆర్డీవోను కలిశారు. డీఆర్డీవో శేషాద్రి మాట్లాడుతూ రైతులు ఆధునిక విధానాల్లో సాగు చేసి అధిక దిగుబడులు సాధించేలా ప్రోత్సహించాలన్నారు. కరీంనగర్ జిల్లాలో చేపడుతున్న విధానాలను రాజన్న సిరిసిల్ల జిల్లాలోనూ అమలు చేస్తామని సంస్థ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ జి.స్వప్నరెడ్డి తెలిపారు. సంస్థ అడ్మిన్ మేనేజర్ భాగ్యలక్ష్మి, డివిజన్ మేనేజర్ జింక నాగరాజు, ఎంఈలు సాదియా, లక్ష్మణ్, రాము, రాజు తదితరులు పాల్గొన్నారు.

హోటళ్లపై ఫారెస్ట్ అధికారుల దాడి

హోటళ్లపై ఫారెస్ట్ అధికారుల దాడి

హోటళ్లపై ఫారెస్ట్ అధికారుల దాడి