
జామ..లాభాల తోట
గంభీరావుపేట(సిరిసిల్ల): జామతోటలు పెంచా లంటే రైతులు వెనుకంజ వేస్తుంటారు. ఏడాదంతా పంట కోసం ఎదురుచూడాలని.. దిగుబడి కూడా అంతంతే వస్తుందనే ఆలోచనలో ఉంటా రు. కానీ గంభీరావుపేట మండలం నర్మాలకు చెందిన యువరైతు బొంగు మల్లేశంయాదవ్ ప్ర యోగాత్మకంగా సేంద్రియ విధానంలో తైవాన్ జామను సాగుచేస్తున్నాడు. ఏడాదంతా దిగుబడి వచ్చేలా ప్రణాళికాబద్ధంగా పెంచుతున్నాడు. రెండేళ్ల క్రితం వరకు వరి సాగుచేసిన మల్లేశం పంట మార్పిడి చేయాలని జామ సాగుచేస్తున్నాడు.
విభిన్న ఆలోచనలతో..
హార్టికల్చరల్ అధికారుల సలహాలతో సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తూ అధిక దిగుబడులు సాధిస్తున్నాడు. తైవాన్ జామకు మార్కెట్లోనూ డిమాండ్ ఉంది. నాలుగు నెలల నుంచి పూతపూసి ఆరో నెల నుంచి కాపు వస్తుందని రైతు తెలిపాడు. ఎకరాకు దాదాపు 10 టన్నుల దిగుబడి సాధిస్తున్నట్లు వివరించాడు.
సేంద్రియ పద్ధతిలోనే..
తనకున్న ఎకరం భూమిలో రెండేళ్ల క్రితం జామ మొక్కలు నాటాడు. ఖమ్మం జిల్లా అశ్వరావుపేట నుంచి 700 మొక్కలు తెప్పించాడు. మొక్కలకు మధ్య మీటర్ దూరం ఉండేలా నాటాడు. జీవా మృతం, కోళ్లఎరువు, పశువుల పేడ, వేపపిండి, వేపనూనెతో సేంద్రియ పద్ధతిలో పెంచుతున్నా డు. కలుపు మొక్కలు తొలగిస్తున్నాడు. అటవీ జంతువులు, కోతుల బెడద లేకుండా ముళ్లకంచెఏర్పాటు చేసుకున్నాడు. అంతరపంటలుగా బీర, దోస, కాకర, టమాట, వంకాయ, వేరుశనగ, బెండకాయ సాగుచేస్తున్నాడు. జామ, కూరగాయలు విక్రయిస్తూ లాభాలు ఆర్జిస్తున్నాడు.
మార్కెట్లో డిమాండ్ ఉంది
జామపండ్లకు మార్కెట్లో డిమాండ్ ఉంది. జా మపండ్లను స్థానిక మార్కెట్లోనే విక్రయిస్తున్నాను. జామతోట సాగులో నా తల్లిదండ్రులు సహకరిస్తున్నారు. కోతులు, అడవి పందుల బెడద తీవ్రంగా ఉంది. తాత్కాలికంగా ముళ్లకంచెతో రక్షణ ఏర్పాటు చేసుకున్న. ప్రభుత్వం సబ్సిడీపై సోలార్ ఫెన్సింగ్ ఇస్తే బాగుంటుంది. – బొంగు మల్లేశంయాదవ్,
యువరైతు, నర్మాల

జామ..లాభాల తోట