
సగం సీట్లు ఖాళీ
● గంభీరావుపేటలో ఇంటర్, డిగ్రీ, పీజీ కళాశాల విద్యార్థినుల హాస్టల్
● పాఠశాల విద్యార్థుల కోసం ఎస్సీ బాలుర వసతి గృహం
● రెండింటిలోనూ వంద చొప్పున సీట్లు
● అడ్మిషన్ల కోసం ప్రచారబాటలో అధికారులు
గంభీరావుపేట(సిరిసిల్ల): విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన హాస్టళ్లలో సగం సీట్లు కూడా భర్తీ కావడం లేదు. అధికారుల ప్రచారం చేసినా చాలా మంది ఆసక్తి చూపడం లేదు. ఫలితంగా సగంలోపే సీట్లు భర్తీ అవుతున్నాయి. షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ కళాశాలలు, పాఠశాలల విద్యార్థుల కోసం గంభీరావుపేట మండల కేంద్రంలో రెండు వసతి గృహాలను వేర్వేరుగా ఏర్పాటు చేశారు. ఆరో తరగతి నుంచి పదో తరగతి విద్యార్థుల కోసం ఎస్సీ బాలుర వసతి గృహం. ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ కళాశాలల విద్యార్థినుల కోసం మరో హాస్టల్ ఏర్పాటు చేశారు. రెండు హాస్టళ్లలో వంద సీట్ల చొప్పున కేటాయించారు.
సగం సీట్లు ఖాళీ
ప్రస్తుతానికి రెండు హాస్టళ్లలో సగం సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. దాదాపు 50 విద్యార్థుల్లోపే ఉన్నారు. గతేడాది పొడవునా ఆ సీట్లు ఖాళీగానే ఉన్నాయి. ఈ విద్యాసంవత్సరంలో విద్యార్థుల సంఖ్య పూర్తిస్థాయిలో భర్తీ చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. అన్ని రకాల వసతులు ఉన్నా వసతిగృహంలో సీట్లు ఎందుకు ఖాళీగా ఉంటున్నాయో చర్చిస్తూ.. విద్యార్థుల సంఖ్య పెంచాలనే ఉద్దేశంతో అధికారులు వసతిగృహంలో చేరాలని, చేర్పించాలని ప్రచారం చేస్తున్నారు. ఇటు కళాశాల అధ్యాపకులతో.. అటు పాఠశాలల ఉపాధ్యాయులతో కలిసి ప్రచారబాటలో పాల్గొంటున్నారు. వసతిగృహాల్లో కల్పిస్తున్న సదుపాయాలపై తల్లిదండ్రులకు వివరిస్తున్నారు. ఇతర మండలాలకు చెందిన విద్యార్థులకు సైతం ప్రవేశాలు కల్పించడం జరుగుతుందని అధికారులు పేర్కొంటున్నారు. వసతిగృహానికి కేటాయించిన వందసీట్లలో ఎస్సీలకు 75 శాతం, బీసీలకు 12, ఎస్టీలకు 6 శాతం చొప్పున సీట్లు కేటాయిస్తున్నారు. రెండు హాస్టళ్లలోనూ ప్రస్తుతం సగానికి పైగా సీట్లు ఖాళీగానే ఉన్నాయి.
హాస్టళ్లలో పౌష్టికాహారం
విద్యార్థులకు అన్ని రకాల సదుపాయాలతోపాటు నాణ్యమైన పౌష్టికాహారం అందిస్తున్నారు. ఉదయం 7 గంటలకు రాగిజావ, పాలు ఇస్తారు. అనంతరం గంట తర్వాత బ్రేక్ఫాస్ట్లో భాగంగా ఉప్మా, పులిహోర, కిచిడి, చపాతి, పూరీ, ఇడ్లి, జీర రైస్, టమాట అన్నం.. ఇలా రోజుకో రకంగా ఇస్తారు. మధ్యాహ్నం పాఠశాలలో భోజనం ఉంటుంది. సాయంత్రం 5 గంటలకు స్నాక్స్ కింద పల్లీపట్టీలు, అటుకులు, బిస్కెట్స్, శనగలు, బబ్బర్లు, స్వీట్స్తోపాటు ప్రతి ఆదివారం మధ్యాహ్నం చికెన్రైస్, గుడ్డు ప్రత్యేకంగా అందిస్తారు. వారంలో రెండు రోజులు గుడ్డుతోపాటు అరటిపళ్లు, ఇతర పళ్లు విద్యార్థులకు అందించనున్నారు.
అవగాహన కల్పిస్తున్నాం
గంభీరావుపేటలోని కళా శాల, పాఠశాల విద్యార్థుల కోసం ఏర్పాటుచేసిన ఎస్సీ బాలుర, బాలికల వసతిగృహాల్లో అడ్మిషన్ల కోసం ప్ర చారం నిర్వహిస్తున్నాం. వసతిగృహాల్లో ఉండి చదువుకునేలా అవగా హన కల్పిస్తున్నాం. ఇప్పుడిప్పుడే పాఠశాలలు, కళాశాలలు ప్రారంభమయ్యాయి. వంద సీట్లు భర్తీ చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. గంభీరావుపేట మండలంతోపాటు చుట్టుపక్క ల మండలాల్లోనూ విద్యార్థుల తల్లిదండ్రులకు హాస్టల్ ప్రత్యేకతలను, ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాల గురించి అవగాహన కల్పిస్తున్నాం.
– భూదేవి, వసతిగృహాల సంక్షేమాధికారి,
గంభీరావుపేట

సగం సీట్లు ఖాళీ

సగం సీట్లు ఖాళీ