
న్యాయం చేయండి
మంథని: పోలీసులకు భయపడి తన కుమారుడు ఆత్మహత్యకు యత్నించి ఇప్పుడు అచేతనా స్థితిలోకి వెళ్లాడని, తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబం, స్థానికులతో కలిసి శనివారం పట్టణంలోని ప్రధాన చౌరస్తాలో ధర్నాకు దిగింది. అచేతనా స్థితిలోని తన కుమారుడిని అంబులెన్స్లో ఉంచి ఆవేదన వ్యక్తం చేశారు. యువకుడి తల్లి శీలం రాజేశ్వరి కథనం ప్రకారం.. మంథని లోని శ్రీపాదకాలనీకి చెందిన తన కుమారుడు రాజ్కుమార్ ఎంగేజ్మెంట్కు వెళ్లి ఇంటికి వస్తుండగా వడ్లకల్లం వద్ద ఇద్దరు దోస్తులు మాట్లాడుకొని ఒకరినొకరు చిన్నగా కొట్టుకున్నారు. మరుసటి రోజు 30 మంది దాకా వచ్చి కేసు పెట్టారు. దీంతో రాజ్కుమార్ను పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి కొట్టడంతో మనస్తాపం చెందాడు. తన కుమారుడిని అన్యాయంగా పోలీస్స్టేషన్ తీసుకెళ్లారని, కొంతమంది ప్రజాప్రతినిధుల పేర్లు చెబుతూ పోలీసులు కొట్టారని ఆమె వివరించింది. ఈ క్రమంలో అవమానంతో మదనపడుతూ స్నానానికి వెళ్లి బాత్రూంలోనే ఉరివేసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో ఎనిమిది నెలలుగా చికిత్స పొందు తున్నాడు. అయినా, ఇంకా కోలుకోలేదు. దీంతో రాజ్కుమార్ను అంబులెన్స్లోనే తల్లిదండ్రులు, బంధువులు పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తాకు తీసుకొచ్చారు. మంథని ఎస్సై, కానిస్టేబుల్, స్థానిక మాజీ కౌన్సిలర్, ప్రజాప్రతినిధులు, మరికొందరు హమాలీ కార్మికులపై చర్యలు తీసుకోవాలని బంధువులు ఆందోళన చేశారు. సమాచారం అందుకున్న మంథని సీఐ, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బాధితులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని నచ్చజెప్పారు.
అచేతనా స్థితిలోని కుమారుడితో ధర్నా
పోలీసులు, ప్రజాప్రతినిధులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్