
వేములవాడ అభివృద్ధికి ప్రణాళికలు
● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
వేములవాడఅర్బన్: వేములవాడ పట్టణ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. పట్టణంలోని 3వ వార్డు లక్ష్మీపురం, 17వ వార్డు శాసీ్త్రనగర్, 18వ వార్డు గాంధీనగర్లో ఆదివారం రూ.32 లక్షలతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజాప్రభుత్వంలో అన్ని వర్గాల సంక్షేమమే పరమావధిగా ముందుకు పోతున్నామన్నారు. వేములవాడ పట్టణం, రాజన్న ఆలయాలను సమానంగా అభివృద్ధి చేస్తామన్నారు. ఇళ్లు లేని పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపారు. మున్సిపల్ కమిషనర్ అన్వేశ్, పార్టీ పట్టణాధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్, నాయకులు సాగరం వెంకటస్వామి, పుల్కం రాజు, అరుణ్తేజాచారి, కట్కూరి శ్రీనివాస్ పాల్గొన్నారు.